మహబూబ్నగర్: తెలంగాణలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనేనని.. తమతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా ఆదివారం సాయంత్రం నాగర్కర్నూల్లో ఏర్పాటు చేసిన బీజేపీ నవసంకల్ప సభలో నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అలర్పించిన వారికి నివాళులర్పించారు జేపీ నడ్డా. తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల మోడీ పాలనలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారన్నారు. మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని జేపీ నడ్డా చెప్పారు.
తెలంగాణలో మాత్రం అన్ని వర్గాల ప్రజలు దు:ఖంలో ఉన్నారని.. కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రమే సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పోర్టల్, ధరణి పోర్టల్ బంద్ చేస్తామన్నారు. మోడీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకమయ్యాయన్నారు జేపీ నడ్డా. పాట్నాలో జరిగింది అవినీతి, కుల, కుటుంబ పార్టీల ఫొటో సెషన్ అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ అని పేరు మాత్రమే మార్చారని.. బీఆర్ఎస్ అంటే భ్రష్టచార రాక్షసుల సమితి అని దుయ్యబట్టారు.
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు మోడీ ప్రభుత్వం రూ. 4400 కోట్లు మంజూరు చేసిందన్నారు. తెంగాణ కోసం మెగా టెక్స్టైల్స్ పార్కును మోడీ ఇచ్చారన్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ను మోడీ ప్రారంభించారని గుర్తు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్లు మోడీ సర్కారు ఇచ్చిందన్నారు.
