జనసేనాని పవన్ కల్యాణ్ కొత్త వ్యూహాలతో ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ఈ నెల 14 నుంచి వారాహితో ప్రజల్లోకి వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ సారి ఎలాగైనా తాను అసెంబ్లీలోకి అడుగు పెట్టటం తో పాటుగా తన పార్టీకి తగిన గుర్తింపు దక్కాలనేది పవన్ లక్ష్యం.
ఇందు కోసం అటు పొత్తుల దిశగా ప్రయత్నాలు చేస్తూనే..ఇటు పార్టీ పోటీ చేసే స్థానాల పైన సర్వే నివేదికలతో సిద్దం అవుతున్నారు. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిన పవన్..ఈ సారి తాను పోటీ చేసే నియోజకవర్గం పై ఒక నిర్ణయానికి వచ్చారు.
సర్వే రిపోర్టులతో పవన్: వచ్చే ఎన్నికల్లో ప్రయోగాలు ఉండవని పవన్ తేల్చి చెప్పారు. ప్రకాశం నుంచి గోదావరి జిల్లాల వరకు పార్టీ బలం పెరిగిందని విశ్లేషించారు. టీడీపీ, బీజేపీ తో కలిసి ఎన్నికలకు వెళ్లాలనేది పవన్ వ్యూహం. బీజేపీ వద్ద నేరుగా ప్రతిపాదనలు చేసారు. ఇప్పటి వరకు బీజేపీ నుంచి పొత్తుపైన స్పష్టత రాలేదు. బీజేపీ నిర్ణయం తీసుకొనే వరకూ వేచి చూసే ఆలోచనలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు…పవన్ ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీతో పొత్తు పైన పవన్ స్పష్టతమైన సంకేతాలు ఇవ్వటంతో ఇక పోటీ చేసే స్థానాల పైన ఫోకస్ చేసారు. సర్వే సంస్థలను రంగంలోకి దించారు. జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్దులు.. పార్టీకి బలం ఉన్న నియోజకవర్గాలు..ఓటింగ్ శాతం పైన సర్వేల ద్వారా నివేదికలు సిద్దం చేస్తున్నారు.
పవన్ పోటీ ఎక్కడి నుంచి: ఈ సారి పవన్ కల్యాణ్ సీట్లతో పాటుగా పవర్ షేరింగ్ పైన గట్టిగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలని పవన్ డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానాలను పవన్ ఎంపిక చేసుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో తాను పోటీ చేస్తే ఎలాంటి మద్దతు ఉంటుంది..ఏ స్థాయిలో ఓట్లు పోలవుతాయానే వివరాల కోసం ఈ సర్వేలు చేయించినట్లుగా తెలుస్తోంది.
