పవన్ ప్లాన్ పై హైకమాండ్ దే నిర్ణయం-బీజేపీకి లాభం లేకున్నా.. సుజనా చౌదరి కామెంట్స్..

పవన్ కళ్యాణ్ పొత్తుల మీద బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారని సుజనా చౌదరి వెల్లడించారు. బీజేపీ, జనసేన పొత్తుతోనే ముందుకు సాగుతున్నాయన్నారు. తమ అధిష్టానం ఏం చెబితే అలాగే నడుస్తామన్నారు.

బీజేపీ రాష్ట్రంలో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి కేంద్రం ఎక్కువ సాయం చేసిందని సుజనా తెలిపారు. ఈ విషయం లో చర్చకు ఎవరొచ్చినా సిద్దమన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా బీజేపీ లబ్ది పొందలేక పోయింది కానీ అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం సాయం చేస్తూనే ఉందన్నారు.

మోడీ తొమ్మిదేళ్ల పాలన పై ఏపీలో యాభై లక్షల కర పత్రాల పంపిణీకి బీజేపీ శ్రీకారం చుట్టింది. వీటిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి విజయవాడలో ఆవిష్కరించారు. స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా మోడీ అభివృద్ధి చేశారని సుజనా చౌదరి తెలిపారు. తొమ్మిదేళ్ల లో నవభారత్ ఆవిష్కృతమైందన్నారు. ఈ విషయం మోర్గాన్ అనే పెద్ద సంస్థలే చెబుతున్నాయన్నారు. పేద, ధనిక మధ్య భారీ వ్యత్యాసం ఉండేదని, పేదలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి జీవన ప్రమాణాలు పెంచారని ప్రశంసించారు. భారతదేశం నుంచే ఇతర దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేశామని సుజనా తెలిపారు. జనాభా లో చైనాను మన దేశం మించి పోయిందని, అయినా కోవిడ్ సమయంలో ప్రాణ నష్టం చాలా వరకు నివారించారన్నారు.

ఏపీలో విభజన చట్టం లో ఉన్న అనేక అంశాలను మోడీ అమలు చేశారని సుజనా తెలిపారు. మోడీ పాలనలో ఎపి కి విద్యా సంస్థలు, ఎయిమ్స్, జాతీయ రహదారులు నిర్మాణం జరిగిందన్నారు. ఏపీ ప్రభుత్వం అసమర్థత వల్ల పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. ప్రాజెక్టు ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కూడా కేటాయించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ను పూర్తి చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు.

గత, ప్రస్తుత ప్రభుత్వాల వల్ల పోలవరం ఆలస్యం అయ్యుందని సుజనా ఆరోపించారు. రాజధాని అమరావతి ని అభివృద్ధి చేయకుండా జగన్ నాశనం చేశారని విమర్శించారు. మోడీ నిధులు ఇచ్చినా మూడు రాజధానులు పేరుతో రాష్ట్ర అభివృద్ధి ని ఆపేశారన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు కూడా విడతల వారీగా కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు.

YES9 TV