: విజయవాడ : ఏపీలో నిరుపేద గర్భిణిలకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. గర్భంలోని శిశువు ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే టిఫా స్కాన్ కోసం ప్రైవేటు డయాగ్నస్టిక్స్లో భారీ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండా టిఫా స్కాన్ సదుపాయాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది. తల్లీ బిడ్డల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా గర్భిణులకు కొత్తగా ఉచితంగా టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామలిటీస్) స్కానింగ్ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. టిఫా స్కానింగ్ టెస్ట్ ద్వారా గర్భంలోని శిశువుల ఎదుగుదలలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి, ముందుగానే జాగ్రత్తపడేందుకు వీలు కలుగుతుందని కృష్ణ బాబు తెలిపారు. రేడియాలజిస్టులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టు కృష్ణ బాబు స్పష్టంచేశారు.
ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లోనూ టిఫా స్కానింగ్ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తేల్చిచెప్పారు. పుట్టబోయే శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణుల ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం అనే ఉద్దేశంతో గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేకంగా కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు, గర్భిణులకు మధ్య ఒక అనుబంధ వ్యవస్థ ఏర్పాటైనట్టు తెలిపారు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభంపై స్పష్టత. 2023-24 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయని అన్నారు. మరో వారం రోజుల్లోగా ఎన్ఎంసీ అధికారిక బృందాలు ఈ మెడికల్ కాలేజీల్లో తనిఖీలు పూర్తి చేస్తాయని.. ఆ తరువాత తరగతులు ప్రారంభం కానున్నాయని కృష్ణ బాబు తెలిపారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరమైన 2024-25 నుంచి మరో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 2025-26 విద్యా సంవత్సరం నుంచి మరో 7 వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్లో తరగతులు ప్రారంభం అయ్యేలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. ఇది కూడా చదవండి :
