ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించనుండగా.. సాధ్యమైనంత త్వరగా మూల్యాంకనం పూర్తిచేసి ఫలితాలను మే మొదటి వారానికిల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 18న పరీక్షలు ముగిస్తే.. ఏప్రిల్ 26 నాటికే మూల్యాంకనం ముగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెన్త్ క్లాస్ విద్యార్థులు పై తరగతులు వెళ్లేందుకు ఆలస్యం కాకుండా ఫలితాలను త్వరగా రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. గతంలో మాదిరి 11 పేపర్లు కాకుండా.. ఈ ఏడాది ఆరు పేపర్లు నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ పరీక్షలకు ఇప్పటికే 6.6 లక్షల మంది స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులకు ఈ నెల 23వ తేదీ నుంచి 26 వరకు తత్కాల్‌ స్కీమ్‌ కింద ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరక్టర్‌ డి.దేవానందరెడ్డి తెలిపారు.

రూ.500 ఫైన్‌తో తత్కాల్‌ స్కీమ్‌ కింద దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రూ.1,000 ఫైన్‌తో ఈ నెల 27 నుంచి 31 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. గడువు ముగిసిన తరువాత మరోసారి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో పరీక్షలు రాసిన విద్యార్థులకు మాత్రమే అడ్వాన్స్ సంప్లీమెంటరీ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుందన్నారు. పరీక్షల షెడ్యూల్ ఇలా.. ఏప్రిల్‌ 3న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ ఏప్రిల్‌ 6న సెకండ్‌ లాంగ్వేజ్‌ ఏప్రిల్‌ 8న ఆంగ్లం ఏప్రిల్‌ 10న గణితం ఏప్రిల్‌ 13న సామాన్య శాస్త్రం ఏప్రిల్‌ 15న సాంఘిక శాస్త్రం ఏప్రిల్‌ 17న కాంపోజిట్‌ కోర్సు పరీక్ష ఏప్రిల్‌ 18న వొకేషనల్‌ కోర్సు పరీక్ష ఏప్రిల్‌ 17న జరిగే కంపోజిట్‌ కోర్సుల్లో ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్‌ 2 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.15 గంటల వరకు 30 మార్కులకు ఉంటుంది. ఓరియంటల్ సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌ కోర్సుల విద్యార్థులకు సంస్కృతం, అరబిక్‌, పర్షియన్ కోర్సుల్లో ఏప్రిల్ 17వ తేదీన 100 మార్కుల పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. అదేవిధంగా ఏప్రిల్ 18వ తేదీన ఓరియంటల్ లాంగ్వేజ్ కోర్సుల్లో భాగంగా మెయిన్ లాంగ్వేజ్ పేపర్‌ 2 పరీక్షను సంస్కృతం, అరబిక్‌, పర్షియన్ భాషల్లో నిర్వహిస్తారు. ఒకేషనల్ కోర్సుల్లో థియరీ పరీక్షలు కూడా అదే తేదీన జరగనున్నాయి.

Posted Under AP
Editor