Latest Posts

ఈ ఏటీఎం నుంచి రూ.500 విత్ డ్రా చేస్తే రూ.2500 చేతికి.. ఎగబడ్డ జనం

ఏటీఎం నుంచి రూ.500 విత్ డ్రా చేస్తే.. రూ.2500 వస్తే ఎవరైనా ఏం చేస్తారు..? వచ్చినకాడికి విత్ డ్రా చేసుకుని మెల్లగా అక్కడ నుంచి జారుకుంటారు. ఇంకా ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి విషయం చెప్పి.. వాళ్లను అక్కడికి పంపిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అలా చేయలేదు. ఏటీఎం నుంచి అధికంగా డబ్బు రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వివరాలు ఇలా.. పాతబస్తీలోని మొఘల్‌పురా పోలీసు స్టేషన్‌ పరిధి హరిబౌలి చౌరస్తాలో ఓ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఏం ఉంది. మంగళవారం రాత్రి నగదు విత్ డ్రా చేసుకునేందుకు అక్కడికి శాలిబండకు చెందిన ఓ వ్యక్తి వచ్చాడు. ఏటీఎంలో రూ.500 ఎంటర్ చేయగా.. రూ.2500 చేతికి వచ్చాయి. దీంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఇన్‌స్పెక్టర్ శివ కుమార్ వెంటనే ఏటీఎం వద్దకు చేరుకున్నారు.

అప్పటికే విషయం తెలుసుకున్న చాలా మంది స్థానికులు అక్కడికి ఎగబడ్డారు. ఇన్‌స్పెక్టర్ ఏటీఎంలో లోపలకు వెళ్లి చెక్ చేశారు. రూ.500 విత్ డ్రా చేస్తే రూ.2500 వచ్చాయి. దీంతో వెంటనే బ్యాంక్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఏటీఎం కేంద్రాన్ని మూసి వేయించి.. అక్కడ ఉన్న జనాలను పంపించారు. టెక్నీకల్ సమస్యల కారణంగానే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి ఘటన ఇటీవల సిద్దిపేట జిల్లాలోనూ జరిగింది. ఓ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఓ వ్యక్తి వెళ్లగా.. అతను రూ.1000 డ్రా చేస్తే 2 వేల రూపాయలు వచ్చాయి. దీంతో అతనితో పాటు వెనుకల ఉన్న వారు కూడా వచ్చినకాడికి డబ్బులు విత్ డ్రా చేసుకుని వెళ్లిపోయారు. ఈ విషయం అలా అలా అందరికీ తెలిసిపోవడంతో ఆ ఏటీఎం వద్దకు జనాలు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా భారీగా జనాలు తరలిరావడంతో బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి చెక్ చేయగా.. అసలు విషయం తెలిసింది. దీంతో వెంటనే ఏటీఎంను క్లోజ్ చేసి.. అక్కడ ఉన్నవారందరినీ పంపించేశారు.

Editor