కర్నూలు జిల్లా
ఆలూరు
ఆలూరు MRO కార్యాలయంలో RDO తనిఖీ – సిబ్బంది వైఖరిపై తీవ్ర ఆగ్రహం
హత్తి బెళగల్ గ్రామానికి చెందిన భూములను పరిశీలించడానికి వచ్చిన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO), అనంతరం ఆలూరు మండల రెవెన్యూ ఆఫీసర్ (MRO) కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, మీడియా ప్రతినిధులు MRO కార్యాలయం వద్దకు చేరుకుని కార్యాలయ పరిస్థితులపై RDO గారికి ఫిర్యాదు చేశారు. MRO, RI (రెవెన్యూ ఇన్స్పెక్టర్) తో పాటు ఇతర కార్యాలయ సిబ్బంది ఏకతాటిపై పనిచేయడం లేదని, గ్రూపులుగా విడిపోయి అంతర్గత విభేదాలతో వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. ఈ వర్గపోరు కారణంగా ప్రజలకు సంబంధించిన రెవెన్యూ పనులు, దరఖాస్తులు ముందుకు సాగక తీవ్ర ఆలస్యం అవుతున్నాయని మీడియా ముందర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఫిర్యాదులపై తీవ్రంగా స్పందించిన RDO, MRO మరియు కార్యాలయ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రజా పనులను పక్కనపెట్టి గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదు. తదుపరి విజిట్కు వచ్చేటప్పుడు మీ అందరికీ నోటీసులతో వస్తాను” అని హెచ్చరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.
