ఈటల రాజేందర్ తో,మాజీ మంత్రి మల్లారెడ్డి..ఆసక్తికర చర్చ..

మాజీ మంత్రి మల్లారెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్య శుక్రవారం ఆసక్తికర చర్చ జరిగింది. అయితే, ఆ చర్చ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం గుండ్లపోచంపల్లిలోని కండ్లకోయలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. అక్కడ వీరిద్దరూ ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

 

ఇదే సమయంలో మల్లారెడ్డిని ఈటల రాజేందర్ ఓ ప్రశ్న అడుగగా మల్లారెడ్డి ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్నా నేను గెలుస్తున్నానా? అని ఈటల అడుగగా మల్లారెడ్డి స్పందిస్తూ ‘నువ్వే గెలుస్తున్నవ్ అన్నా.. నో డౌట్.. ‘ అంటూ ఈటల బుగ్గలను పట్టుకుని ఆప్యాయంగా ఆన్సర్ ఇచ్చారు. అదేవిధంగా అన్నతో ఫొటో తీయండంటూ ఈటలతో ఫొటో దిగారు.

 

అయితే, మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి ఏంటి ఇలా మాట్లాడారు..? ఎవరైనా తన పార్టీ అభ్యర్థి గెలుస్తారంటారు కానీ, ఈయనేంటి ఇలా అన్నారు..? అని పలువురు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన తీరే అంతా.. అందరితో ఆయన అలా మాట్లాడుతూ నవ్విస్తుంటారు అంటూ మరికొందరు అనుకుంటున్నారంటా.

 

అయితే, ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న మల్కాజిగిరి నియోజకవర్గం దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా గుర్తింపు ఉంది. జనభా పరంగానే కాదు.. ఈ నియోజకవర్గాన్ని తెలంగాణకు ఆర్థిక పరంగా గుండెకాయ లాగా భావిస్తారు. అంతేకాదు.. ఈ నియోజకవర్గం తూర్పు వైపు ఉండడంతో అత్యంత సెంటిమెంట్ గా కూడా భావిస్తారు.

 

దాదాపు 38 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ఈసారి మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై చాలా దృష్టి సారించాయి. ఎలాగైనా ఈ నియోజకవర్గం నుంచి గెలవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన మల్కాజిగిరి నుంచి ఇప్పటివరకు మూడు ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి టీడీపీ గెలుపొందాయి.

Editor