రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా అన్ని పార్టీల్లో అసంతృప్తులు ఉంటూనే ఉంటారు. అవి జాతీయ పార్టీల్లో ఎక్కువగా ఉండటం సహజమే. ప్రాంతీయ పార్టీల్లో కాస్త తక్కువగానే ఉన్నా ఇటీవల కాలంలో వారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా జంపు జలానీలు తమ కోరికలను నెరవేర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. తమ డిమాండ్లు అధిష్టానం పక్కన పెట్టడంతో వారిలో నైరాశ్యం పెరగడం కామనే. ఈ నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముందుకు రావడంతో పార్టీ నేతలు ఆలోచనలో పడుతున్నారు. ఇంకా ఇలాంటి సంఘటనలు భవిష్యత్ లో చోటుచేసుకోవనే వాదనల సందర్భంలో ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడంపై దృష్టి సారిస్తున్నారు.
KCR టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో తమకు పదవులు దక్కలేదనే ఉద్దేశంతో గ్రేటర్ ఎమ్మెల్యేలు సుభాష్ రెడ్డి, కృష్ణారావు, వివేకానంద, అరికెపూడి గాంధీ, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది మొదట రహస్య సమావేశమనే చర్చ జరిగినా తరువాత బహిర్గతం కావడం వివాదానికి కారణమైంది. తమ పార్టీ కేడర్ లో అసంతృప్తి ఉందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. విషయం కాస్త మంత్రి కేటీఆర్ దృష్టికి చేరడంతో దీనిపై కేసీఆర్ ఏం చర్యలు తీసుకుంటారో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. బీఆర్ఎస్ లో అసంతృప్తి జ్వాలలు బహిర్గతం కాకుండా అందరిలో ఉండే అభిప్రాయాలు ఇవే. మరోవైపు ఈ భేటీలో మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా చర్చలు జరిగాయని చెబుతున్నా కేసీఆర్ మాత్రం కఠినంగా ఉంటారనే వాదనలు వస్తున్నాయి. పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు తమ మదిలో ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేయకుండా లోపలే మథనపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు పక్కదారి పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో అందరికి టికెట్లు ఇస్తామని చెబుతున్నా లోపల మాత్రం వేరే ఆలోచనలు ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.
