: అధికార బీఆర్ఎస్లో కలకలం రేగింది. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు. ఇతర నియోజకవర్గాల్లో ఆయన జోక్యంపై ఎమ్మెల్యేలు గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉండగా.. తాజాగా సమావేశం నిర్వహించి చర్చించారు. సోమవారం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, బేతి సుభాష్ రెడ్డి, అరికెపూడి గాంధీలు హాజరయ్యారు. తమ నియోజకవర్గ విషయాల్లో మంత్రి మల్లారెడ్డి జోక్యం చేసుకోవడంతో వీరంత ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మైనంపల్లి ఇంట్లో రహస్యంగా సమావేశం అయ్యారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ మార్పు విషయంలో మల్లారెడ్డి వ్యవహరించిన తీరుపై కుత్బల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తమ నియోజకవర్గాల పదవుల విషయంలో మాల్లారెడ్డి తమకు సమాచారం ఇవ్వడం లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. పార్టీ అంటే ఒక కుటుంబం అని.. కుటుంబంలో సమస్యలు వచ్చినట్లే పార్టీలో కూడా సమస్యలు ఉంటాయని వారు తెలిపారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తాము అంతా ఒక మాటపైన ఉన్నామని చెప్పారు. ‘మా కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. పదవులన్నీ ఒకే నియోజకవర్గానికి వెళుతున్నాయి. జిల్లా పదవులన్నీ మంత్రి తీసుకెళ్లిపోతున్నారు. మంత్రి మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారు. నామినేటెడ్ పదవులు మా నియోజకవర్గాల కార్యకర్తలకు రావడం లేదు. పదవులన్నీ ఆయన అనుచరులకే ఇప్పించుకుంటున్నారు..’ అని ఎమ్మెల్యేలు మాధవరం, అరికెపూడి అంటూ విమర్శలు గుప్పించారు.
