Latest Posts

స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు..!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముహుర్తం ఖరారైందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్లు నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు.

 

మొత్తంగా రాష్ట్రంలో 67 శాతం రిజర్వేషన్లు అమలుకు నిర్ణయం

ఇప్పటికే ప్రభుత్వానికి స్థానిక రిజర్వేషన్ల జిల్లాల వారి నివేదికలు చేరినట్లు సమాచారం. అయితే.. దీనికి సంబంధించిన జీవోను ఇవాళ ఏ క్షణమైన జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 50 శాతం రిజర్వేషన్లు మించొద్దని ఉన్న చట్టాన్ని తొలగించనుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా రాష్ట్రంలో 67 శాతం రిజర్వేషన్లు అమలుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.

 

డెడికేటెడ్ కమిషన్ ఇంపిరికల్ డేటా ప్రకారమే రిజర్వేషన్లు..

పంచాయతీరాజ్ రిజర్వేషన్ల సీలింగ్ చట్టాన్ని జీవోతో సవరించనుంది సర్కార్. ఆ తర్వాత ప్రభుత్వం సూచించిన రిజర్వేషన్లు ఎన్నికల కమిషన్ అమలు చేయనుంది. డెడికేటెడ్ కమిషన్ సేకరించిన ఇంపిరికల్ డేటా ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించబోతున్నట్లు సమాచారం.

 

దసరా లోపే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు..

ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి దసరా లోపే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. పంచాయతీరాజ్ శాఖతో పాటు పలు శాఖల అధికారులతో సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు సమావేశం నిర్వహించినట్లు సమాచారం. రిజర్వేషన్లపై ఇచ్చే జీవో విడుదల తర్వాత పంచాయతీరాజ్ చేయబోయే అంశాలు, ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి అంశాలు అందజేయాలనే దానిపై చర్చించినట్లు సమాచారం.

 

కాలయాపన చేయకుండా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ముందుకు సాగాలి..

ఎక్కడా కాలయాపన జరగకుండా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది. జీవోపై ఎవరైనా కోర్టును ఆశ్రయించక ముందే శాఖల తరపున కార్యాచరణ పూర్తి చేయాలని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని సీఎమ్ సూచించినట్లు సమాచారం.

Editor