తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కనుంది. ఇందుకు ముమూర్తం ఖరారైంది. ఇప్పటివరకు డీజిల్, విద్యుత్ రైళ్లు నడుస్తుండగా.. హైడ్రోజన్తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది. దానిలో భాగంగా.. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. రైలు జూలై నుంచి హరియాణాలోని జీంద్ జిల్లాలో పరుగులు తీయనుంది. జీంద్ నుంచి సోనిపత్ మధ్య నడవనుంది. ఈ రైలుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రైలు ప్రారంభం అయిన తరువాత దశల వారీగా విస్తరణ చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
రూ 80 కోట్ల ఖర్చు
భారతీయ రైల్వేశాఖ సరికొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. హైడ్రోజన్తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ తొలి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు డిజైన్ను రూపొందించింది. ఈ రైలు గరిష్ఠంగా గంటకు 110 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇన్నోవేషన్ కింద హైడ్రోజన్ పవర్తో నడిచే 35 రైళ్లను నడపాలని రైల్వే భావిస్తోంది. ప్రతి రైలుకు దాదాపు 80 కోట్లు ఖర్చు అవుతోంది. గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అదనంగా 70కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. హెరిటేజ్, హిల్స్టేషన్స్ రూట్స్లో ఈ రైళ్లను నడపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
తుది దశకు పనులు
హైడ్రోజన్తో నడిచే రైలు నిర్మాణ పనులు చెన్నైలో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆ పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. ఇక్కడ హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, భద్రత కోసం పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. చెన్నైలో తయా రు చేస్తున్న రైలును జీంద్కు తీసుకువచ్చాక ట్రయల్ రన్ జరుగుతుందని తెలిపారు. జీంద్, సోనిపత్ మధ్య సజావుగా ప్రయాణం ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు. అయితే హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణం రెండు నెలల్లో పూర్తవుతుంది. ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశోక్ వర్మ ఆదివారం హైడ్రోజన్ ప్లాంట్ను పరిశీలించారు.
