ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించే పద్ధతిపై సుప్రీంకోర్టు బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉచిత రేషన్, డబ్బు అందుతున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదని కోర్టు పేర్కొంది. ఉచితాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పించే హక్కుకు సంబంధించిన పిటిషన్ ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. దురదృష్టవశాత్తు ఈ ఉచిత పథకాల కారణంగా ప్రజలు పని చేయడానికి ఇష్టపడడం లేదని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.
వారు ఎటువంటి పని చేయకుండానే ఉచిత రేషన్ ,డబ్బు పొందుతున్నారని.. ప్రభుత్వం ప్రజలను ప్రధాన స్రవంతిలోకి చేర్చి దేశాభివృద్ధికి దోహదపడేలా ప్రేరేపించాలని ధర్మాసనం పేర్కొంది. ప్రజలకు మంచి సౌకర్యాలు అందించాలనే ప్రభుత్వ ఉద్దేశం మంచిదే.. కానీ వారిని సమాజంలోని ప్రధాన స్రవంతిలో భాగం చేసి దేశ అభివృద్ధికి దోహదపడడానికి అనుమతిస్తే మంచిదా కాదా.. అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి మంచిది కాదు అంటూ స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ ను ఖరారు చేసే ప్రక్రియలో ఉందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఈ మిషన్ లో పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పించడం వంటి వివిధ సమస్యలను పరిష్కరించడం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఈ మిషన్ ను ఎప్పుడు అమలు చేస్తుందో ధ్రువీకరించాలని కోర్టు అటార్నీ జనరల్ ను కోరింది. ఈ కేసు తదుపరి విచారణను ఆరు వారాల తర్వాత సుప్రీంకోర్టు షెడ్యూల్ చేసింది.
గతేడాది అక్టోబర్ లో కూడా ఉచితాలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేసి సమాధానం కోరింది. ఈ పిటిషన్ ఎన్నికల సమయంలో ఉచితాలను ప్రకటించడాన్ని వ్యతిరేకించింది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలు చేయకుండా చూసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు.
