బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా -ఈ కార్ రేసింగ్లో ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనకు సమన్లు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని కేటీఆర్ ను ఈడీ అధికారులు కోరారు. కేటీఆర్ తో పాటు ఏసీబీ ఎఫ్ఐఆర్ లో ఉన్న అప్పటి ప్రభుత్వ అధికారులను కూడా విచారణకు పిలిచారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. అరవింద్, బీఎల్ఎన్ రెడ్డిని జనవరి 2, 3వ తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. దీంతో వీరంతా చిక్కుల్లో పడ్డారు.
ఫార్ములా ఈ-రేస్ కేసులో తెలంగాణ ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ తో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా ప్రైవేటు కంపెనీ సీఈవో పేరును చేర్చింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన్ను అరెస్టు చేయకుండా ఆదేశాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈడీ విచారణకు పిలవడంతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ మీద కేటీఆర్ అరెస్టు కాకుండా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈడీ అరెస్టు చేసే అవకాశాలూ లేకపోలేదు.
