దేశంలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ముహూర్తం కుదిరింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కూడా ఇటీవలే విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.
288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో పోలింగ్ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్ ఉంటుంది. ఈ నెల 22వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ఆరంభమౌతుంది. 29వ తేదీ వరకు కొనసాగుతుంది.
30వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. వాటిని ఉపసంహరించుకోవడానికి ఈసీ ఇచ్చిన గడువు నవంబర్ 4. 20వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 202. ప్రస్తుతం ఇక్కడ ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.
శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ సారి సంపూర్ణ మెజారిటీని సాధించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి ఆయా పార్టీలన్నీ కూడా. ఈ దిశగా అన్ని పార్టీలు తమ ప్రచార పర్వానికి తెర తీయబోతోన్నాయి.
ఈ పరిస్థితుల మధ్య- ఎన్నికల్లో పోటీ చేయబోయే బీజేపీ అభ్యర్థులతో కూడిన తొలి జాబితా వెలువడింది. మొత్తం 99 మందికి చోటు లభించిందీ లిస్ట్లో. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీ రాష్ట్రశాఖ అధినేత చంద్రశేఖర్ బవాన్కులే, మంత్రులు గిరీశ్ మహాజన్, సుధీర్ ముంగంటివార్, శ్రీజయ అశోక్ చవాన్ వంటి సీనియర్ నేతల పేర్లు ఇందులో ఉన్నాయి.
దేవేంద్ర ఫడ్నవిస్ నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి బరిలో దిగారు. ఇది ఆయన సొంత నియోజకవర్గం. ఈ స్థానం ఆవిర్భవించినప్పటి నుంచీ అంటే 2009 నుంచీ ఫడ్నవిస్కే పట్టం కడుతున్నారు నాగ్పూర్ సౌత్ వెస్ట్ ఓటర్లు. ఈ స్థానంలో ఆయనకు ఓటమి అనేదే ఇప్పటివరకు ఎదురు కాలేదు.
బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే- కమ్టీ, గిరీశ్ మహాజన్- జామ్నేర్, సుధీర్ ముంగంటివార్- బల్లార్పూర్, శ్రీజయ అశోక్ చవాన్- భోకర్, ఆశీష్ షెలార్- వాంద్రా వెస్ట్, మంగళ్ ప్రభాత్ లోధా- మలబార్ హిల్, రాహుల్ నర్వేకర్- కొలాబా, ఛత్రపతి శివేంద్ర రాజే భొసాలె- సతారా నుంచి పోటీలో నిలిచారు.
