తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెండింగ్ రుణమాఫీ తో పాటుగా రైతు భరోసా నిధల విడుదల పైన ఫోకస్ చేసింది. ఈ నెలాఖరులోకా రుణమాఫీ అమలు కాని వారికి నిధులు అందేలా ఆలోచన చేస్తోంది. అదే విధంగా వచ్చే నెలలో రైతు భరోసా విడుదల చేయాలని భావిస్తోంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నిధుల జమ పైన ఈ నెల 23న జరిగే మంత్రివర్గ సమావేశం లో ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది.
ఉద్యోగులకు డీఏలు
ఈ నెల 23న తెలంగాణ మంత్రివర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులు, రైతుల అంశాలనే చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగులకు రెండు పెండింగ్ డీఏల విడుదలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలకు ఇప్పటికే పెండింగ్ డీఏల విడుదల పైన ప్రభుత్వం నుంచి హామీ దక్కింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మూడు శాతం డీఏను పెంచింది. దీంతో, దీపావళి వేళ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.
ప్రభుత్వం కసరత్తు
ఇక, రైతులకు సంబంధించిన చెల్లింపు పైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రైతులకు రుణమాఫీ అందని వారి వినతులు ప్రభుత్వానికి చేరాయి. ఇప్పటి వరకూ 31 వేల కోట్ల మంది రైతులకు ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. మిగిలిన మొత్తం ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రుణ మాఫీ చేయాల్సిన వారి వివరాలు ప్రభుత్వానికి చేరాయి. రుణమాఫీ తో పాటుగా రైతు భరోసా నిధులను కూడా తొలివిడత నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.
రైతులకు చెల్లింపులు
రైతులకు పెట్టుబడి సాయం కింద భరోసా నిధులు తొలి విడతగా ఒక్కొక్కరి బ్యాంకు అకౌంట్ లో 7,500 రూపాయలు జమ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తున్నప్పటికీ ఇంకా రైతు భరోసాను అమలు చేయలేదన్న అపప్రధను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. విపక్షాలు ఇదే అంశం పైన తరచూ విమర్శలు చేస్తున్నాయి. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళేందుకు రేవంత్ సర్కార్ సిద్దం అవుతోంది. దీంతో, ఆ ఎన్నికలకు ముందుగానే రైతు రుణమాఫీ పూర్తి చేయటంతో పాటుగా భరోసా నిధుల విడుదల దిశగా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది
