తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు ఢిల్లీలో వరుస భేటీలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అటు కేంద్రమంత్రులు, ఇటు కాంగ్రెస్ పెద్దలతో సమావేశమవుతున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కీలక ప్రాజెక్టులను సాధించే దిశగా సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్.. పలు అంశాలపై వినతులు అందించారు.
మూసీ ప్రక్షాళనకు రూ. 4వేల కోట్లు ఇవ్వాలని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. గోదావరి జలాలను ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ కలిపే పనులకు సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో 7లక్షల 85 వేల ఇళ్లకు నల్లా కలెక్షన్లు లేవన్న సీఎం రేవంత్.. జల్జీవన్ మిషన్ నిధులు విడుదల చేయాలని మంత్రి సీఆర్ పాటిల్ను కోరారు.
అంతకు ముందు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని హర్దీప్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశం ఇవ్వాలని సీఎం కోరారు.
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్, మంత్రుల భేటీ
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ సమావేశమయ్యారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్న అంశాలను రాహుల్, ప్రియాంకలకు వివరించామని తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ అంశాలపై తెలిపినట్లు చెప్పారు. రాహుల్ గాంధీని తెలంగాణకు రావాలని కోరినట్లు భట్టి తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసి తెలంగాణ పీసీసీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశామని తెలిపారు. కాగా, మంగళవారం సీఎం రేవంత్, మంత్రులు హైదరాబాద్ తిరిగి రానున్నారు.
