తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇల్లు, ఫాంహౌస్కే పరిమితమైన కేసీఆర్.. ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నట్లు సమాచారం.
బుధవారం అంటే జులై 24న తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆరోజు కేసీఆర్ అసెంబ్లీకి రానున్నట్లు తెలిసింది. బడ్జెట్ సమావేశంలో పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేతగా మొదటిసారి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై తమ వాదనను బలంగా వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, మంగళవారం ఉదయం 10 గంటలకు గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు. అనంతరం 11 గంటలకు శాసనసభకు హాజరుకానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలు, రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రస్తావించడంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ, ఫీజు రీఎంబర్స్ మెంట్, పారిశుద్ధ్యంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం
జులై 23 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఉదయం 11 గంటలకు శాసనసభలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రసంగం చేయనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు.
24వ తేదీన అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఉదయం 9 గంటలకు శాసనసభలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలుపనున్నారు. అనంతరం శాసనసభలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించనున్నారు.
