రానున్న ఐదేళ్లులో ఆంధ్రప్రదేశ్కు స్వర్ణయుగంగా మారబోతుందా? హస్తిన రాజకీయాలను గమనిస్తే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించబోతోంది.
ఢిల్లీ ఎయిర్పోర్టులో చంద్రబాబు దిగినప్పటి నుంచి నేషనల్ మీడియా అంతా ఆయన్ని ఫాలో అవుతూ వచ్చింది. చివరకు నేషనల్ మీడియా లేవనెత్తిన ప్రశ్నలకు బాబు సమాధానం ఇచ్చేశారు. తాను ఎన్డీయే కంటిన్యూ అవుతానని చెప్పకనే చెప్పేశారు. తాజాగా ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం మేరకు మోదీ మంత్రివర్గంలో ఐదారు కేబినెట్ పదవులు దక్కించుకోవాలని భావిస్తోందట టీడీపీ.
నాలుగు కేబినెట్ బెర్తులు, మరో రెండు ఎంఓఎస్ (MoS) మంత్రులు కోరుతున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తున్నమాట. అందులో ఫైనాన్స్, ఐటీ, గ్రామీణాభివృద్ధిశాఖ, పట్టణాభివృద్ధి, భారీ పరిశ్రమలు, షిప్పింగ్ శాఖ వంటి శాఖలున్నట్లు సమాచారం. ఇదికాకుండా స్పీకర్ పోస్టు కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ శాఖలు ఎవరెవరికి ఇవ్వాలనేది ఆసక్తికరంగా మారింది. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, (విశాఖ నుంచి భరత్), ఏపీలో కోటా (పురందేశ్వరి(బీజేపీ), జనసేన, గుంటూరు నుంచి పెమ్మసాని, వేమిరెడ్డి (నెల్లూరు), రాజ్యసభ కోటా (గల్లా జయదేవ్ లేదా అశోక్ గజపతిరాజు), రాయలసీమ నుంచి మరొకరు ఆయా మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మోదీ కేబినెట్ కొలువుదీరిన తర్వాతే అప్పుడు ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కేంద్రంలో టీడీపీ ఐదారు కేబినెట్ మంత్రి పదవులు తీసుకుంటే ఏపీతోపాటు తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందని ఆ ప్రాంత నేతలు భావిస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఏపీలో పోలింగ్కు ముందు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈసారి కచ్చితంగా తెలంగాణలో టీడీపీ బరిలో ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. మొత్తానికి కేంద్రంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు శకం మొదలైందన్నమాట.
