వచ్చేవారం మేడిగడ్డను సందర్శించనున్న సీఎం ఎం రేవంత్‌రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడిగడ్డను సందర్శించ నున్నారు. వచ్చేవారం ఆయన పర్యటన ఉండనుంది. ఏ రోజున సీఎం విజిట్ చేస్తారనేది రెండు రోజుల్లో తెలియనుంది. ఈ టూర్‌లో భాగంగా ఏ మేరకు డ్యామేజ్ అయ్యింది, పనులకు ఎంతకాలం పడుతుందని అనేదానిపై ఓ అంచనాకు రానున్నారు.

 

తాజాగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డ మరమ్మతులను వేగం చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం సచివాలయంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు, సీడబ్ల్యూసీ ఇంజనీర్లుతో ఆయన సమావేశం నిర్వహించారు.

 

మేడిగడ్డ పునరుద్దరణ పనులపై ఇటీవల జాతీయ ఆనకట్టల భద్రత పర్యవేక్షణ సంస్థ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా పనులు కొనసాగించాలని ఆదేశించారు. వర్షాలు వచ్చేలోగా తాత్కాలిక పనులను పూర్తి చేయాలని సూచన చేశారు. ముఖ్యంగా మేడిగడ్డ పనులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అదే సమయంలో అటు అన్నారం, సుందిళ్ల వద్ద పనులను చేపట్టాలన్నారు.

 

పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని అధికారులను కోరారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వచ్చేవారం మేడిగడ్డ బ్యారేజ్‌ని సందర్శిస్తారని చెప్పుకొచ్చారు. ఇదిలా వుండగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సూచనలు, సలహాలు అందించేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కూడిన కమిటీని నీరుపారుదల శాఖ ఏర్పాటు చేసింది.

 

కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ ఆయా ప్రాజెక్టులను సందర్శించి సమగ్ర అధ్యయనం చేశాక కమిషన్‌కు నివేదిక ఇవ్వనుంది.

 

మేడిగడ్డ వద్ద మళ్లీ ప్రకంపనలు

ఇదిలావుండగా మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ ప్రకంపనలు వచ్చాయి. కుంగిన ఏడో బ్లాకులోని 16వ నెంబరు గేటును ఎత్తడానికి నీటిపారుదల శాఖ అధికారులు ప్రయత్నించారు.అయితే బ్యారేజీ కింద నుంచి భారీగా ధ్వనులు రావడంతో వెంటనే ఆ పనులను నిలిపివేశారు. అక్కడి సెన్సార్లు సైతం శబ్దాలను గుర్తించి అలర్ట్ చేశాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమాదానికి లోనయ్యే అవకాశముందని ఆ శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Editor