ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంపై అందరి దృష్టిపడింది. పిఠాపురం గురించి రోజు వార్త వెలుగులోకి రావడంతో అక్కడ ఏం జరుగుతోందన్న చర్చ ఏపీ అంతటా నెలకొంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వంగా గీతను బరిలోకి దించింది ఫ్యాన్ పార్టీ. ఇరుపార్టీలు ఆ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపించేందుకు బాధ్యతను మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తీసుకున్నారు . కూటమి అభ్యర్థి పవన్కల్యాణ్ను ఓడించేందుకు ఎత్తుకు పైఎత్తులు చేస్తున్నారు. పవన్కు మద్దతుగా టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే వర్మ అంతా చక్కబెడుతున్నారు. ఇక్కడ ముద్రగడ వర్సెస్ వర్మ పోటీగా అందరూ చెబుతున్నారు. తనను ఓడించేందుకు కడప నుంచి గూండాలు, రౌడీలను పిఠాపురానికి తరలించారని పవన్కల్యాణ్ రైల్వేకోడూరు రోడ్ షోలో వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాగబాబు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
ఇదిలావుండగా శుక్రవారం రాత్రి భారీ ఎత్తున మద్యం డంప్ పిఠాపురంలో బయటపడింది. ఈ డంప్ విలువ మార్కెట్ అక్షరాలా 80 లక్షల రూపాయలు ఉంటుందన్నది అధికారుల అంచనా. మద్యం బాక్సులను చూసి అధికారులే షాకయ్యారు. జగ్గయ్య చెరువుకు చెందిన వట్టూరి సతీష్కుమార్ ఇంట్లో 250 బాక్సులు, సాలిపేటలోని వెంటక సత్యనారాయణమూర్తి వద్ద 260 బాక్సులు, వైఎస్సార్ గార్డెన్స్ కాలనీలోని ఓ ఇంట్లో 290 బాక్సులు, కుమారపురంలోని వేమగిరి సుమార్తమ్మ నివాసంలో 215 బాక్సులు మొత్తం 1015 బాక్సులను అధికారులు గుర్తించారు.
ఒక్కో బాక్సులో 48 మద్యం బాటిళ్ల చొప్పున మొత్తం 48 వేల బాటిళ్లను గుర్తించారు అధికారులు. ఇందులో గోవాకు చెందిన మద్యం కూడా ఉంది. దీని వెనుక ఎవరు ఉన్నారనేదానిపై లోతుగా దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు. అయితే ఇదంతా వైసీపీకి చెందిన సరుకని స్థానికులు బలంగా చెబుతున్నారు. ముఖ్యంగా పవన్కల్యాణ్ను ఓడించేందుకు భారీ ఎత్తున మద్యాన్ని రంగంలోకి దించినట్టు స్థానికులు చెబుతున్నమాట.
