Latest Posts

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న ఎంపీ కె. కేశవరావు, మేయర్ విజయలక్ష్మి..

సార్వత్రిక ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కె. కేశవరావు, ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ కండువ కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని మేయర్ స్వయంగా ఓ ప్రకటన చేశారు.

 

ముందుగా ఊహించనట్లుగానే గుళాబీ దళానికి సీనియర్ ఎంపీ కె. కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గుడ్ బై చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు వీరు ప్రకటించారు. మార్చి 30వ తేదీనా మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించారు.

 

అధికార పార్టీలో తాము ఉంటేనా సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని అందుకే తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు. అయితే తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఎంపీ కేశవరావు కూడా స్వయంగా వెల్లడించారు.

 

అయితే కె. కేశవరావు గురువారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్లో మాజీ సీఎం కేసీఆర్ తో భేటి అయ్యారు. తాను పార్టీ మారుతున్న అంశాన్ని కేసీఆర్ కు స్వయంగా వెల్లడించారు. ‘తీర్థ యాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికే చేరుతారు. నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతా. 53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పని చేశాను. బీఆర్ఎస్ పార్టీలో నేను పని చేసింది కేవలం పదేళ్లు మాత్రమే. తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరాను. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది. నేను మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యా. నేను పుట్టింది, పెరిగింది, కాంగ్రెస్ పార్టీలోనే.. ఆ పార్టీలోనే చనిపోవాలని అనుకుంటున్న’ అని అన్నారు.

 

అయితే కేకే తీరుపై బీఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాను సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాని.. తాను కాంగ్రెస్లోనే చనిపోతానని కేకే చెప్పారు. అయితే కేకేతో పాటుగా అతని కూతురు మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరబోతుండగా.. తన కుమారుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. కేకే తాను ఎప్పుడు పార్టీలో చేరబోతున్నాను అనేది త్వరలోనే వెల్లడిస్తా అన్నారు.

Editor