ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సీఎం జగన్ పాలనపై మండిపడ్డారు. జగన్ రాయలసీమ ద్రోహి అని కామెంట్స్ చేశారు. గురువారం రాత్రి సత్యసాయి జిల్లా కదిరిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన వైసీపీ ప్రభుత్వంలో పలు విమర్శలు చేశారు.
కదిరి రోడ్ షోలో జగన్ పాలనపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాయలసీమ ద్రోహి ఎవరనేది ప్రజలే తేల్చుకోవాలన్నారు. రాయలసీమ కోసం జగన్ ఈ ఐదేళ్లలో చేసిందేం లేదన్నారు. నంగనాచిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమలో 142 ప్రాజెక్ట్ లు పెండింగ్ లో ఉంటే వాటిని జగన్ అధికారంలోకి వచ్చాక రద్దు చేశారని వెల్లడించారు. ఐదేళ్లలో జగన్ ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. మే 13న జగన్ పెత్తనం పడిపోతుందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాయన్నారు.
జగన్ అధికారంలోకి వచ్చాక రాయలసీమలో ఒక్క ఎకరాకి కూడా నీటిని అందించలేక పోయారన్నారు. అదే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ కోసం తమ ప్రభుత్వం రూ.12వేల కోట్లు ఖర్చు చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు. సీమలో పడ్డ ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలాలుగా మార్చాం అని అన్నారు. ప్రజలకు ఎవరు మేలు చేశారో.. ఎవరు కీడు చేశారో తెలుసుకోవాలన్నారు. ప్రజల మధ్యకు వస్తేనే తెలుస్తుందని అన్నారు.
తమ హయాంలో రాయలసీమ వ్యాప్తంగా 10 లక్షల పంట కుంటలు తవ్వించాలని వెల్లడించారు. బిందు సేద్యం చేసే వారికి 90శాతం రాయితీ అందించామన్నారు. రాయలసీమకు కీయా వంటి పరిశ్రమలు తీసుకురావడం టీడీపీ బ్రాండ్ అన్నారు. అదే రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టడం జగన్ బ్రాండ్ అని విమర్శించారు.
