చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా..?

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా మారిన పార్టీ టీఆర్‌ఎస్‌. 14 ఏళ్ల పోరాటం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. దీంతో ఉద్యమ సారథిగా ఉన్న కేసీఆర్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ను 2014 ఎన్నికల్లో తెలంగాణ సమాజం గెలిపించింది. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుస్తారని అందరూ ఆశించారు. కానీ, ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా పాలనను సాగించారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌… మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టారు. దీంతో రెండోసారి గతంకంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు. కానీ, కేసీఆర్‌ అండ్‌ ఫ్యామిటీ అహంకారం పెరుగడం మినహా.. ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో నుంచి తప్పించారు. ఎదుటి పార్టీల్లో తప్పులు ఎత్తి చూపిన గులాబీ నేతలు తమ తప్పులను కూడా రైటే అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. తెలంగాణకు తామే దిక్కు అన్నట్లుగా రాచరిక పాలన తరహాలో వ్యవహరించారు.

 

More

From Telangana politics

ఓటమి తర్వాత పాఠం..

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సమెతలా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తత్వం బోధపడినట్లు ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, మరోవైపు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేసీఆర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఓటమి నుంచి బయటపడి.. గెలుపు బాట పట్టేందుకు యత్నిస్తున్నారు. క్యాడర్‌కు ధైర్యం చెబుతున్నారు.

ఇప్పటికే ఏడు ప్లామెంట్‌ నియోజకవర్గాల సమీక్షలు ముగిశాయి. ఈ సమీక్షల్లో మాట్లాడిన నేతల్లో చాలామంది కేసీఆర్, కేటీఈఆర్, కవిత, హరీశ్‌రావుల వ్యవహారశైలినే తప్పుపట్టారు. ఓటమికి ప్రధాన కారణం ఈ నలుగురే అని వేలెత్తి చూపారు. పదేళ్ల పాలనలో పెరిగిన అవినీతి, అరాచకాలనూ ప్రస్తావించారు. ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించడంలో విఫలమైనట్లు ఆరోపించారు.

 

సిట్టింగులను మార్చకపోవడం..

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్న సిట్టింగులకే కేసీఆర్‌ మూడోసారి టికెట్లు ఇవ్వడం బీఆర్‌ఎస్‌ ఓటమికి మరో కారణమని అంటున్నారు. దీంతో అందరి వ్యాఖ్యలు వింటున్న కేటీఆర్‌.. వాటిని ఖండించలేకపోతున్నారు. చేసేదిలేక చివరకు కేటీఆర్‌ కూడా నేతల ఆరోపణలను అంగీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమికి బాధ్యత తనదే అని ప్రకటించారు. ద్వితీయ శ్రేణినేతలు, క్యాడర్ ను పట్టించుకోలేదని అంగీకరించారు.

 

పథకాల అమలులో విఫలం..

అంతేకాదు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు, రైతుబంధు పథకాలను సరిగా అమలు చయకపోవడం, రైతుబంధు పథకంలో చాలామంది భూస్వాములకు కూడా డబ్బులు వేయటంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చేసిన అభివృద్ధి, సంక్షేమపథకాలే గెలిపిస్తాయని అనుకున్నా.. సిట్టింగులను మార్చే ఆలోచన చేయలేదని పేర్కొంటున్నారు. కాళేశ్వరంలో లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటును ప్రస్తావిస్తు పెద్దపెద్ద నిర్మాణాలు చేసినపుడు చిన్న లోపాలు సహజమే అని సమర్ధించుకునే ప్రయత్నంచేశారు.

 

మొత్తంగా బీఆర్‌ఎస్‌ ఓటమిని కేటీఆర్‌ అంగీకరించారు. జరిగిన తప్పులు అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్‌ కానివ్వమని నేతలకు హామీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే కేటీఆర్‌ మర్చిపోయిన విషయం ఏమిటంటే.. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పటికీ తమ పాలనపై వ్యతిరేకతను మాత్రం అంగీకరించడం లేదు. కాంగ్రెస్‌ తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిందని ఆరోపిస్తున్నారు. ఈ అహంకార పూరిత మాటలు.. లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Editor