కోదండరాం కు కీలక పదవి – సీఎం రేవంత్ నిర్ణయం..!!

టీజేఎస్‌ అధినేత కోదండరాంకు కలక పదవి దక్కనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు కోదండరాం భేషరతుగా మద్దతిచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుల ఎంపిక పైన కసరత్తు జరుగుతోంది. ఈ సమయంలో కోదండరామ్ కు ఏ పదవి ఇవ్వాలనే అంశం పైన కొంత కాలంగా ఢిల్లీ వేదికగా చర్చ జరిగింది. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పెద్దల సభకు కోదండరామ్: తమకు ఎన్నికల సమయంలో మద్దతుగా నిలిచిన కోదండరామ్ కు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవప్రదమైన పదవిలోకి తీసుకుంటామని కాంగ్రెస్ అదిష్ఠానం అప్పట్లో హామీ ఇచ్చింది. ఈ క్రమంలో కోదండరామ్‌కు ప్రభుత్వ సలహాదారుగా లేదా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తారంటూ ప్రచారం జరిగింది.

అయితే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వేం నరేందర్‌రెడ్డితో పాటు మరొకరి పేరును పరిశీలిస్తున్నారు. కానీ, ఇప్పుడు శాసన మండలి సభ్యుడుగా టీజేఎస్‌ అధినేత కోదండరాం పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం గవర్నర్‌ కోటా కింద శాసనమండలిలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాలకు కోదండరాం, అందెశ్రీల పేర్లు ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి కసరత్తు: గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్‌, కె.సత్యనారాయణ పేర్లను సిఫారసు చేసింది. అయితే గవర్నర్‌ కోటా కింద ఎంపికయ్యే అర్హత వారికి లేదంటూ గవర్నర్‌ తమిళిసై ఆ సిఫారసును తిరస్కరించారు.

ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ రెండు స్థానాలనూ సామాజిక రంగంలో సేవలందించిన కోదండరాం, సాహిత్య రంగంలో సేవలందించిన అందెశ్రీ పేర్లను సిఫారసుచేసే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోదండరాంను ప్రభుత్వ సలహాదారుగా తీసుకోవాలా.. లేక గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయాలా అన్నదానిపైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజ్యసభ కు తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికలపైనా: ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఖాళీ ఏర్పడింది. ఆ నియోజకవర్గానికి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా ఈసీ ఆదేశించింది. ఓటరు నమోదు కోసం నిర్ణీత షెడ్యూల్‌ను సూచించింది.

ఈ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపుతారనే దాని పైన అనేక సమీకరణాలు తెర మీదకు వచ్చాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల అభ్యర్దిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి పేరు ఖరారు చేయనున్నట్లు చెబుతున్నారు. రాజ్యసభ కోసం సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డితో పాటు మరి కొందరు సీనియర్‌ నాయకులు పోటీ పడుతున్నారు.

Editor