ఏపీలో ఎన్నికల సీజన్ దగ్గరపడటంతో సీట్లు, టికెట్ల చర్చ పెరుగుతోంది. అదే సమయంలో టికెట్ గ్యారంటీ లేని నేతలు పార్టీలు మారిపోతున్నారు. అధికార వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు చేపట్టడంతో ఇదే అదనుగా పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి ఫిరాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిపైనా పార్టీ మారాలనే ఒత్తిడి పెరుగుతోందనే ప్రచారం జరుగుతోంది.
తాను నలభయ్యేళ్లుగా రాజకీయాలు చేశానని, కానీ ఈ నాలుగేళ్లలో పడిన ఇబ్బందులు ఎప్పుడూ పడలేదని తన అనుచరులతో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పినట్లు ఇవాళ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఉంటే ఎప్పటికీ ఇబ్బందులు తప్పేలా లేవని, నియోజకవర్గంలో తిరిగే పరిస్దితులు లేదని, ఏదైనా రోడ్డు మీద ఆగితే నిరసన వ్యక్తమవుతోందని మాగుంట చెప్పినట్లు ఈ వార్తల సారాంశం. రోడ్లు బాగోలేదని, ఏ ప్రాంతం కూడా అభివృద్ధికి నోచుకోలేదని, టీడీపీలోకి వెళ్లాలని అనుచరుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోందని, కొత్త సంవత్సరంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని కూడా మాగుంట చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
దీనిపై మాగుంట శ్రీనివాసులరెడ్డి స్పందించారు. తనమీద ఎవరో అసత్య ప్రచారం చేస్తున్నారని, తన ఫొటోను కూడా వాడుతున్నారని జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రచారంతో తనకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. కావున ఈ అసత్య ప్రచారం చేసిన వారిని సత్వరమే కనిపెట్టి వారిపై తగు చర్యలు తీసుకోవాలని మాగుంట పోలీసుల్ని కోరారు. ఈ విషయంలో మీరు తీసుకున్న చర్యల్ని నాకు తెలియజేయాలని కూడా పోలీసుల్ని ఆయన కోరారు
