ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో ఇప్పటివరకూ మౌనంగా ఉంటూ వచ్చిన అసంతృప్త నేతలు ఎన్నకిల వేళ గళం విప్పుతున్నారు.
రాజకీయంగా తమకు భవిష్యత్తు ఎటు బెటర్ అంటే అటు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ వైజాగ్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరేందుకు రెడీ అయిపోతున్నారు.
గతంలో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కార్పోరేటర్ గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్ పదవి ఆశించారు. అయితే సీఎం జగన్ మాత్రం సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు బదులుగా హరికుమారికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయనకు గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్ధానిక సంస్ధల కోటాలో వైజాగ్ నుంచి అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచి ఎమ్మెల్సీ అయిన వంశీకృష్ణ.. మండలి సభ్యుడిగా ఉన్నారు.
అయితే వైజాగ్ లో మారుతున్న రాజకీయ పరిణామాలు, వచ్చే ఎన్నికలు, అనంతర రాజకీయాల్ని దృష్టిలో ఉంచుకుని వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రేపు కాకినాడకు వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ మేరకు కార్యకర్తలకు కూడా సమాచారం ఇచ్చారు. పవన్ తో భేటీ తర్వాత వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయి. దీంతో వైజాగ్ వైసీపీలో కలకలం రేగింది.
వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మార్పు వ్యవహారంపై స్ధానిక మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఆయన పార్టీ మారితే రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యం అవుతుందన్నారు. అయితే ఎమ్మెల్సీ వంశీ పార్టీ మారుతున్నట్లు తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని చెప్పుకొచ్చారు. దీంతో వైజాగ్ వైసీపీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది
