డబుల్ డిజిట్ సీట్లు పక్కా: తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందంటూ కిషన్ రెడ్డి..

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమాయత్తం అవుతున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా ఓట్లు మాత్రం పెరిగాయని తెలిపారు. అయితే, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ అధికారం సాధించిందని చెప్పారు.

 

ఈ ఎన్నికలను సెమీపైనల్‌గా కాంగ్రెస్ అభివర్ణించి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ మిత్రపక్షాల సవాల్‌ను ప్రజలు స్వీకరించి స్పందించారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్మారని విశ్వాసం వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల్లో కుటుంబ సభ్యులు లేని ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టారన్నారు.

 

మోడీని మరోసారి గెలిపించేందుకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈాసారి ఢిల్లీ ఓటు మోడీకే అని అన్ని వర్గాల ప్రజలు చెబుతున్నారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమాయత్తం అవుతున్నాయని చెప్పారు.

 

‘పార్లమెంటు ఎన్నికలపై జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. మంగళవారం రంగారెడ్డి, బుధవారం హైదరాబాద్‌ పార్లమెంటు స్థానాలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. . మండల కమిటీల పటిష్టానికి జనవరిలో కార్యాచర్యణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగే విస్తృత స్థాయి సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్ సమావేశంలో పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు.

 

జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట ఉందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సమాజాన్ని బీజేపీ భాగస్వామ్యం చేయాలని సంకల్పించిందని తెలిపారు. ఆ రోజున కోట్లాది హిందువుల కల సాకారం అవుతుందన్నారు. దేశంలోని ప్రతి దేవాలయాన్ని జనవరి 22న అలంకరిస్తామని కిషన్ రెడ్డి వివరించారు.

Editor