తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల పైన ప్రధాన పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. బీజేపీ అభ్యర్దుల కసరత్తు ప్రారంభించింది. కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల పరాజయం మరిపించి..పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అందులో భాగంగా స్వయంగా లోక్ సభ బరిలో నిలివాలని యోచిస్తున్నట్లు సమాచారం.
లోక్ సభ ఎన్నికల సమరం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు సిద్దం అవుతోంది. దీని పైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలు ప్రారంభించారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో సోమవారం కేటీఆర్ సమావేశమయ్యారు. జనవరి 26వ తేదీలోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని, పరాజయం చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ఛార్జ్లని, వారు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డి పేరు ఖరారు చేసారు.
ఎన్నికల బరిలో కేసీఆర్ : ఇక, ఓటమితో డీలా పడిన కేడర్ ను పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం చేసేందుకు కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం కేసీఆర్ స్వయంగా లోక్ సభ బరిలో దిగుతారని పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణతో పాటుగా మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ అభ్యర్దులను బరిలోకి దింపుతున్నారు. కేసీఆర్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీని వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. కానీ, ఇప్పుడు మల్కాజ్ గిరి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఐదేళ్ల పాటు పార్టీని లైమ్లైట్లో ఉంచాలంటే.. ఆపై వచ్చే మళ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా బీఆర్ఎస్ను నిలపాలంటే వచ్చే లోక్సభ ఎన్నికలే కీలకం కానున్నాయి. దీంతో, తానే బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ నుంచి ఎంపీగా..గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత ఎంపీగా రాజీనామా చేయటంతో కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు.
హోరా హోరీ పోరు : మెదక్ నుంచి ఈ సారి కాంగ్రెస్ అభ్యర్దిగా విజయశాంతి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన సమయంలోనే ఈ మేరకు హామీ ఇచ్చారు. విజయశాంతి 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీగా గెలుపొందారు. ఆ సమయంలో టీఆర్ఎస్ నుంచి కేసీఆర్, విజయశాంతి ఇద్దరే ఎంపీలుగా ఉన్నారు. తరువాత జరిగిన పరిణామాల్లో విజయశాంతి పార్టీలు మారారు. పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు. ఢిల్లీలో బీఆర్ఎస్ పేరు గట్టిగా వినిపించాలని పార్టీ నేతలకు కేసీఆర్ చెబుతున్నారు. దీంతో, కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగటం ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన దూకుడుగా వ్యవహరించాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారు. దీంతో..తెలంగాణలో జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ హోరా హోరీ పోరు తప్పేలా లేదు.
