ఢిల్లీకి రేవంత్..

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మరోసారి దేశ రాజధానికి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ దఫా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. దీనికి అవసరమైన అపాయింట్‌మెంట్ కూడా లభించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆయనతో పాటు ఢిల్లీ వెళ్తారు.

 

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క.. ప్రధాని మోదీతో భేటీ కాబోతోండటం ఇదే తొలిసారి. ఇది మర్యాదపూరక భేటీగా భావిస్తోన్నారు. అదే సమయంలో- రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలక అంశాలు, ప్రతిపాదనలను మోదీకి అందజేస్తారని చెబుతున్నారు.

 

ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రధాని వద్ద ప్రస్తావిస్తారని సమాచారం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట్ స్టీల్ కోచ్ ఫ్యాక్టరీ, ఏపీతో నెలకొన్న నదీ జలాల పంపకాల వివాదం, బకాయి నిధుల విడుదల.. వంటి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మోదీకి అందజేస్తారని సమాచారం.

 

మంగళవారం ఉదయం హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 4:30 గంటలకు మోదీతో సమావేశమౌతారు. అనంతరం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధిష్ఠానంతో భేటీ అవుతారు రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు, ఖాళీ అయిన శాసనమండలి స్థానాల భర్తీ.. వంటి అంశాలపై పార్టీ హైకమాండ్‌తో చర్చిస్తారు.

 

మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను రేవంత్ రెడ్డి ఇప్పటికే సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీపైనా అధిష్ఠానంతో మాట్లాడతారు. ఫిబ్రవరి/మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున అభ్యర్థుల ఎంపిక విషయంపైనా చర్చిస్తారు.

Editor