జగన్ పై చంద్రబాబు కొత్త అస్త్రాలు..

ఏపీలో ఎన్నికల రాజకీయం అనూహ్యంగా మారుతోంది. జగన్ తన అధికారం మరో విడత నిలబెట్టుకోవటానికి కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. జగన్ ను ఓడించటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ అడుగులు వేస్తున్నారు. బీజేపీ వైఖరి తేలాల్సి ఉంది. కాంగ్రెస్ ఈ సారి ఏపీ పైనా ఫోకస్ చేస్తోంది. ఇదే సమయంలో జగన్ టార్గెట్ గా ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. ఈ సమయంలో వైసీపీ పైన పై చేయి సాధించేందుకు చంద్రబాబు మైండ్ గేమ్ ప్రారంభించారు.

 

కొత్త వ్యూహాలు : ఏపీలో సీఎం జగన్ వర్సస్ చంద్రబాబు వ్యూహాలు ఆసక్తి కరంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తు వేళ అనూహ్యంగా జగన్ సిట్టింగ్ లను మారుస్తూ సామాజిక సమీకరణాలు తెర మీదకు తెచ్చారు. వైసీపీ, జనసేన సీట్ల ఖరారులో డైలమా వాతావరణం క్రియేట్ చేసారు. ఇదే సమయంలో చంద్రబాబు కౌంటర్ గా మైండ్ గేమ్ ప్రారంభించారు. కొంత కాలంగా టచ్ లో ఉన్న ప్రశాంత్ కిషోర్ ను ఇప్పుడు వ్యూహాత్మకంగా ఉండవల్లి నివాసానికి రప్పించారు. దీని ద్వారా నాడు జగన్ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ తన వైపు వచ్చేసారనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేసారు. కానీ, ప్రశాంత్ కిషోర్ కేవలం సలహాలు ఇవ్వటానికి మాత్రమే సిద్దమయ్యారని సమాచారం.

 

మొన్న పీకే – నిన్న షర్మిల : ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఇక వ్యవహరించనని గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు టీడీపీ ముఖ్యుల నుంచి పదే పదే వచ్చిన ఆభ్యర్దనల మేరకు టీడీపీకి సూచనలు చేయటం వరకు అంగీకరించారు. అయితే, గతంలో తామే విమర్శించిన ప్రశాంత్ కిషోర్ ను ఇప్పుడు చంద్రబాబు ఆహ్వానించటం పైన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కల్యాణ్ కు సీఎం సీటు షేరింగ్ పైన లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అయ్యాయి. వీటి నుంచి డైవర్ట్ చేయటానికే పీకేతో ఇప్పటి వరకు ఢిల్లీలో, జూమ్ ద్వారా జరిగిన సమావేశాలు ఇప్పుడు ఓపెన్ గా నిర్వహించినట్లు చెబుతున్నారు. ఇక, దీనికి కొనసాగింపుగా ఇప్పుడు షర్మిల క్రిస్మస్ కు పంపిన గిఫ్ట్ ల విషయంలోనూ లోకేష్ ట్వీట్ వైరల్ అవుతోంది.

 

వైసీపీ పై మైండ్ గేమ్ : షర్మిల క్రిస్మస్ వేళ నారా కుటుంబానికి గిఫ్ఠ్ లు పంపారు. నారా ఫ్యామిలీతో పాటుగా మరిన్ని రాజకీయ, సినీ ఫ్యామిలీలకు ఇదే తరహాలో గిఫ్ట్స్ పంపారు. అయితే, జగన్ తో విభేదించి తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు.. ఇప్పుడు కాంగ్రెస్ కు దగ్గరైన షర్మిల ఇప్పుడు నారా ఫ్యామిలీకి గిఫ్ఠ్స్ పంపటం రాజకీయంగా చర్చకు కారణమైంది. నాడు 2019 ఎన్నికల్లో బైబై చంద్రబాబు నినాదం షర్మిల బలంగా వినిపించారు. ఇప్పుడు షర్మిల గిఫ్ట్స్ పంపిన విషయాన్ని లోకేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించటం కూడా టీడీపీ మైండ్ గేమ్ లో భాగంగా కనిపిస్తోంది. దీంతో, జగన్ తో విభేదించిన వారు..రాజకీయ వ్యతిరేకులను కూడగట్టి.. ఎన్నికల్లో లబ్ది పొందాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, జగన్ ను ఓడించటానికి చంద్రబాబు ఇంత మందితో రావాల్సి వస్తుందని..అయినా జగన్ దే గెలుపు అంటూ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Posted Under AP
Editor