రూ.500 సిలిండర్‌కు అర్హులు వీరే.. లబ్ధిదారుల ఎంపికపై కీలక నిర్ణయం..!!

రేషన్‌ కార్డుతో లింక్‌..

మహాలక్ష్మీ పథంలో కీలకమైన సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లు రేషన్‌కార్డు ఉన్నవారినే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రూ 500 గ్యాస్‌ సబ్సిడీ పథకానికి రేషన్‌∙కార్డునే ప్రామణికంగా తీసుకొనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్‌ కార్డులతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలనే ప్రతిపాదన ఉన్నా.. అది మరింత ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు. ఇక సబ్సిడీ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుల బయోమెట్రిక్‌ తీసుకోవాలనే నిబంధన సివిల్‌ సప్లయ్‌ అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం.

 

1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు..

తెలంగాణలో ప్రస్తుతం 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. రేషన్‌ కార్డుల సంఖ్య 89.98 లక్షలుగా ఉంది. గివ్‌ ఇట్‌ అప్‌లో భాగంగా 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. వీరిని మినహాయిస్తే 85.79 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు. రేషన్‌ కార్డు డేటాబేస్‌తో మ్యాపింగ్‌ అయిన గ్యాస్‌ కనెక్షన్ల సంఖ్య 63.6 లక్షలుగా ఉంది. ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లకు రూ.340 రాయితీ అందుతోంది. మొత్తం కనెక్షన్లలో ఇవి 11. 58 లక్షలు ఉన్నాయి.

 

ఆరా.. పన్నెండా..?

రాయితీ సిలిండర్లను సంవత్సరానికి ఆరు ఇవ్వాలా లేక 12 ఇవ్వాలా…అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. ఇందు కోసం అర్హుల కుటుంబంలోని సభ్యుల సంఖ్య.. గతేడాది వాడిన సిలిండర్ల సంఖ్య.. వంటి అంశాలను పరిగణలోకి తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతీ నెలా సిలిండర్‌ పొందుతున్న వారి సంఖ్య 44 శాతం మంది మాత్రమే. కొత్త కార్డులు పొందేవారికీ ఈ పథకం అమలు చేస్తారని చెబుతున్నారు. కొత్త గ్యాస్‌ కనెక్షన్లను పరిగణలోకి తీసుకోవద్దని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 28 నుంచి ఈ పథకం ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. అయితే ఇప్పటికీ విధి విధానాలు ఖరారు కాకపోవటంతో అమలు తేదీ మారే అవకాశం ఉంది.

Editor