తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోకి వెళుతూ, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో, సభలు సమావేశాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, బిజెపిలు కీలక ప్రకటనలు చేస్తూ ఓటర్ల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో సిడబ్ల్యుసి కీలక సమావేశాన్ని నిర్వహించి, రానున్న ఎన్నికల నేపథ్యంలో అనేక హామీలను ప్రకటించింది. ఇక ప్రస్తుతం బిజెపి ప్రధాని నరేంద్ర మోడీతో సహా, బిజెపి జాతీయ నాయకులను రంగంలోకి దింపి సభలు, సమావేశాలతో కీలక ప్రకటనలు చేస్తూ ప్రజల మద్దతును పొందే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే బీజేపీ ఎన్నికల కమిటీలను ప్రకటించింది, మొత్తం 14కమిటీలను ప్రకటించిన బీజేపీ ఎన్నికలకు సిద్ధం అయ్యింది.
తాజాగా తెలంగాణ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర బిజెపి కార్యాలయంలో నేడు కీలక భేటీ నిర్వహిస్తుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం హైదరాబాద్ లో జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నిక వ్యూహాంపై ప్రధానంగా చర్చిస్తున్నారు.
పార్టీ జాతీఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, ఓ.బీ.సీ మోర్చా అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.ఎల్.సంతోష్, రాష్ట్ర ఇన్ ఛార్జీ తరుణ్ ఛుగ్, ఎన్నికల కమిటీ కో-ఇన్ ఛార్జీ సునీల్ బన్సల్, రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాశ్ జవదేకర్, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించే దిశగా అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలను బిజెపి ఖరారు చేయనుంది. ఓటర్ల మద్దతును పొందడానికి ఏమి చేయాలి? ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ఎండగట్టాలి? ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏ విధమైన హామీలు ఇవ్వాలి వంటి అనేక అంశాల పైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది.
