తెలంగాణ(Telangana) ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు కదనరంగంలోకి దిగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) హ్యాట్రిక్ విజయం పైన ధీమాగా ఉన్నారు.
కాంగ్రెస్(Congress) ఈ సారి గెలుపు తమదేనని విశ్వాసంతో ఉంది. ఈ సమయంలో బీజేపీ(BJP) మేము సైతం అంటూ రంగంలోకి దిగుతోంది. ఈ సమయంలోనే సర్వేలు ప్రజానాడిని స్పష్టం చేస్తున్నాయి. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పూర్తిగా పాజిటివ్ ఓట్ ను నమ్ముకున్నారు. మేనిఫెస్టో(Manifesto) ప్రకటనకు సిద్దమయ్యారు.
కేసీఆర్ మ్యాజిక్ పని చేసేనా:తెలంగాణ ఆవిర్భావం తరువాత మూడో విడత అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ఈ సారి ఎన్నికల్లో గెలిచేదెవరు. బీఆర్ఎస్ బలహీనపడిందా..కాంగ్రెస్ పుంజుకుందా..బీజేపీ పరిస్థితి ఏంటి. ఎక్కడా చూసినా ఇదే చర్చ. ఈ సమయంలోనే సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. గతం కంటే కాంగ్రెస్ పుంజుకుందని దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
కానీ, అధికారం దక్కిచుకుంటుందా అంటే మాత్రం స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ దక్కుతున్నట్లు కనిపించటం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కేసీఆర్ మ్యాజిక్ ముందు కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ అంత సులువు కాదనే విశ్లేషణలు మొదలయ్యాయి. కాంగ్రెస్ గ్యారంటీ నిర్ణయాలతో అధికారంపై ఆశలు పెంచుకుంది. సరిగ్గా ఇప్పుడు అక్కడే కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు.
పాజిటివ్ ఓటుపైనే :ఒక విధంగా ప్రతిపక్ష పార్టీల కంటే కేసీఆర్ స్వయంగా ఎన్నికల క్షేత్రంలోకి ముందుగానే దిగారు. పార్టీ అభ్యర్దులను ముందుగానే ఖరారు చేసారు. దీని ద్వారా స్థానికంగా టికెట్ల ఆశావాహులు…పార్టీలో పోటీ.. వివాదాలను పరిష్కరించుకొనేందుకు సమయం చిక్కింది. ప్రత్యర్ది పార్టీలు ఇంకా అభ్యర్దుల ఎంపిక కసరత్తులోనే సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాస్తవంగా తెలంగాణలో ప్రతీ నియోజకవర్గం పైన ఉన్న పట్టు … స్థానిక అంశాలపైన అవగాహన..సామాజిక సమీకరణాలు..ప్రజా నాడి విషయంలో కేసీఆర్ కు ఉన్న అనుభవం..చాణక్యంలో ప్రత్యర్ధి పార్టీల నేతల సామర్ధ్యం పోటీ పడలేదు. దీంతో, కాంగ్రెస్..బీజేపీ కోసం డిల్లీ నేతలే స్వయంగా తెలంగాణ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. సంక్షేమం..అభివృద్ధి లో సాధించిన ఫలితాలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా మారుతున్నాయి.
గెలుపు పై ధీమా:కేసీఆర్ వ్యూహాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసే బలమైన వ్యవస్థ..బీఆర్ఎస్ లో ఉంది. కేటీఆర్, హరీశ్ వంటి ట్రబుల్ షూటర్స్ పాత్ర ఎన్నికల్లో కీలకం. ఇక..రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ కు పోటీగా నిలచే నేత లేరనేది వాస్తవం. పదేళ్ల ప్రభుత్వ పాలనపైన సహజంగా ఉందే ఎంతో కొంత వ్యతిరేక ఓటింగ్ రెండు జాతీయ పార్టీల పోటీ మధ్య చీలిపోయే అవకాశం ఉంది.
ఇప్పటికే అన్ని వర్గాలను ఆకట్టుకొనే ప్రకటనలు చేసిన సీఎం కేసీఆర్..ఉద్యోగులకు వరాల ప్రకటనకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ గ్యారంటీకి కౌంటర్ గా ఆకర్షణీయ ప్రకటనలతో మేనిఫెస్టోకు తుది రూపు ఇస్తున్నారు. దసరా నాడు ప్రకటనకు ముహూర్తంగా నిర్ణయం తీసుకున్నారు. పాజిటివ్ ఓట్ బ్యాంక్ ను బలంగా నమ్ముకుంటున్న కేసీఆర్..దక్షిణాదిన తొలి సారి హ్యాట్రిక్ విజయం సాధించిన సీఎంగా కొత్త రికార్డు దిశగా అడుగులు వేస్తున్నారు. మరి కేసీఆర్ తెలంగాణ ప్రజల పైన పెట్టుకున్న నమ్మకం ఫలిస్తుందా లేదా అనేది మరో మూడు నెలల్లో తేలి పోనుంది.
