తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఇప్పటికే ఆయన దేశ రాజధానికి వెళ్లి వారం రోజులు గడిచాయి. రెండు మూడు రోజుల్లో పనులన్నింటినీ పూర్తిచేసుకొని తిరిగివస్తారనుకున్నారుకానీ ఆయన రాలేదు.
అక్కడే తెలుగుదేశం పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసే ప్రయత్నం చేయలేదు.
జైల్లో ఎక్కువకాలం?
చంద్రబాబును జైల్లో పెట్టిన తర్వాత మద్దతిచ్చినవారిని మాత్రం కలిశారు. బీజేడీ, శివసేన, హర్యానా డిప్యూటీ సీఎం వంటివారు నారా లోకేష్ కు సంఘీభావం తెలియజేశారు. మొదటి రెండురోజులు లోకేష్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక ప్రణాళిక ప్రకారం బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారనే విషయాన్ని వివరించారు. తర్వాత న్యాయనిపుణులతో చర్చలు సాగిస్తున్నారు. చంద్రబాబును సుదీర్ఘంగా జైల్లో ఉంచే కుట్రను ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నారని లోకేష్ భావిస్తున్నారు.
తీర్పును బట్టి నిర్ణయం
తనకున్న సమాచారం స్పష్టంగా ఉండటంతో న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఢిల్లీని కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణలో ఉంది. దీనిపై ఆశించిన రీతిలో తీర్పు రాకపోతే వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను లోకేష్ చేస్తున్నారు. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తయింది. క్వాష్ పిటిషన్ పై వ్యతిరేక తీర్పు వస్తే ఏసీబీ కోర్టులో కూడా అనుకూల తీర్పు వస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు భావించడంలేదు.
తలుపు తట్టడమే
బెయిల్ పై వ్యతిరేక తీర్పు వస్తే సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో లోకేష్ ను అరెస్ట్ చేస్తామని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ లోకేష్ ను అరెస్ట్ చేస్తే తదుపరి కార్యాచరణ ప్రణాళికను టీడీపీ ఖరారు చేసుకుంది. నారా బ్రాహ్మణిని కొందరు నాయకులు తెరపైకి తెస్తున్నారు. రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యూత్ ఐకాన్ అవుతారని పార్టీ నాయకులు నమ్మకం పెట్టుకున్నారు.
