టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ స్కాంలో ఏపీ సీఐడీ అరెస్టు చేయడం, అనంతరం ఏసీబీ కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించడం, రాజమండ్రి జైల్లో పరిస్ధితుల్ని జాతీయ స్ధాయికి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న నారా లోకేష్ పలు జాతీయ మీడియా ఛానళ్లకు ఇంటర్వూలు ఇవ్వడంతో పాటు పలువురు జాతీయ నేతల్ని కూడా కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కూడా నిర్వహించారు.
ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో టీడీపీ ఎంపీలతో పార్టీ పార్లమెంటరీ భేటీ నిర్వహించిన నారా లోకేష్ రాబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టుకు దారి తీసిన పరిణామాలు, అనంతరం వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ఎంపీలకు లోకేష్ సూచించారు. అలాగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా హజరయ్యే జాతీయ నేతలకు కూడా ఈ విషయంపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు తప్పు లేకపోయినా, ఎఫ్ఐఆర్ లో ప్రస్తావన లేకపోయినా సీఐడీ అర్ధరాత్రి అరెస్టు చేసిన తీరు, అక్కడి నుంచి 48 గంటల పాటు ఆయన్ను తిప్పడం, చివరికి తర్వాతి రోజు విజయవాడ కోర్టులో హాజరుపర్చడం, అనంతరం వర్షంలోనే రాత్రికి రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంపై పార్లమెంటులో ఎంపీలకు వివరించాలని లోకేష్ తమ పార్టీ ఎంపీల్ని ఆదేశించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా విపక్షాల్ని వేధిస్తున్న తీరును కూడా ప్రస్తావించాలని సూచించారు.
అలాగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం తీసుకురాబోతున్న బిల్లులు, వాటికి టీడీపీ తరఫున వ్యవహరించాల్సిన తీరుపైనా ఎంపీలకు నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే పార్లమెంటులో కేంద్రం తెస్తున్న బిల్లులతో పాటు రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీయేకు అండగా నిలిచిన టీడీపీ.. ఈసారి కూడా అదే వ్యూహం ఎంచుకునే అవకాశం ఉంది.
