గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం’.. ఈ మధ్య కాలంలో ఈ తరహా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దిల్లీ నుంచి తెలంగాణ వరకు బీజేపీయేతర రాష్ట్రాల్లో ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
తమిళనాడులోనూ ఈ వ్యవహారం సర్వత్రా చర్చలకు దారితీస్తోంది. తాజాగా.. గవర్నర్- ప్రభుత్వం మధ్య విభేదాలతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గవర్నర్ రవి తీసుకున్న అనూహ్య నిర్ణయాన్ని డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని గవర్నర్ హోల్డ్లో పెట్టినట్టు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే..!
ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వీ సెంథిల్ బాలాజీపై గత కొన్ని రోజులుగా క్రిమనల్ ఆరోపణలు వస్తున్నాయి. క్యాష్ ఫర్ జాబ్ స్కామ్లో ఆయన రెండు వారాల క్రితం జైలుకు కూడా వెళ్లారు. అయితే.. సెంథిల్ని ఎంకే స్టాలిన్ మంత్రిగా కొనసాగిస్తున్నారు. కానీ ఎలాంటి శాఖను కేటాయించలేదు.
ఇక గురువారం ఓ అనూహ్య ప్రకటన చేశారు గవర్నర్ ఆర్ఎన్ రవి. సెంథిల్ను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి తొలగిస్తున్నట్టు వెల్లడించారు. గవర్నర్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా అరుదు అని సమాచారం.
“సెంథిల్ బాలాజీపై తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు ఉన్నాయి. కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో.. ఆయన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి వెంటనే తప్పిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు,” అని రాజ్ భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.
గవర్నర్ చర్యలను ఎంకే స్టాలిన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
MK Stalin latest news : “మంత్రులను తొలగించే అధికారం గవర్నర్కు లేదు. మేము లీగల్గా ముందుకెళతాము. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము,” అని ఎంకే స్టాలిన్ అన్నారు.
గవర్నర్ చర్యలపై డీఎంకే నేతలు మండిపడుతున్నారు.
“గవర్నర్ అసలు ఏమనుకుంటున్నారు? సెంథిల్ను తప్పించే రాజ్యాంగ అధికార ఆయనకు ఉందా? రాజ్యాంగాన్ని ఆయన కించపరుస్తున్నారు. ఆయన ఓ కీలు బొమ్మలా పనిచేస్తున్నారు. పెద్దలు చేప్పింది చేస్తున్నారు. ఆయన ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించిన పేపర్ను చెత్తకుప్పలో పడేయాలి,” అని డీఎంకే నేతలు విమర్శిస్తున్నారు.
