బెంగళూరు నడి రోడ్డులో విదేశీయుడిపై దౌర్జన్యం

బెంగళూరు: సిలికాన్ సిటీగా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరులో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ ట్రావెల్ వ్లాగర్‌పై స్థానికుడొకడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు.

అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. నడిరోడ్డు మీద ఈ ఘటన సంభవించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులు స్పందించారు. దౌర్జ్యానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

ఆ ట్రావెల్ వ్లాగర్ పేరు పెడ్రో మోటా. నెదర్లాండ్స్ దేశస్తుడు. వివిధ దేశాల్లో పర్యటించడం అతని హాబీ. ప్రఖ్యాత నగరాలు, పర్యాటక కేంద్రాల్లో పర్యటిస్తూ- అక్కడి సంస్కృతి సంప్రదాయాలు, ప్రజల ఆచార వ్యవహారాలను చిత్రీకరిస్తుంటాడు. స్ట్రీట్ ఫుడ్స్‌పైనా పలు వీడియోలను తీశాడు. కొద్దిరోజులుగా అతను బెంగళూరులో నివసిస్తోన్నాడు. కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు, ఆలయాలు, చారిత్రక కట్టడాలపై లైవ్ ప్రజంటేషన్ ఇస్తోన్నాడు.

ఈ క్రమంలో పెడ్రో మోటా ఇవ్వాళ బెంగళూరు చిక్‌పేట్‌లో ఓ వీడియోను చిత్రీకరించే సమయంలో అతనిపై స్థానికుడొకడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అతని పేరు నవాబ్ హయాత్ షరీఫ్. సెల్ఫీ వీడియో ద్వారా చిక్‌పేట్‌ వాతావరణాన్ని పెడ్రో మోటా చిత్రీకరించే సమయంలో షరీఫ్ అతణ్ని అడ్డుకున్నాడు. చెయ్యి పట్టుకుని గట్టిగా లాగాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించాడు. ఊహించని ఈ ఘటనతో పెడ్రో భయాందోళనకు గురయ్యాడు. తనను వదిలేయాలంటూ ప్రాధేయపడటం ఈ వీడియోలో రికార్డయింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిన వెంటనే చిక్‌పేట్ పోలీసులు స్పందించారు. దౌర్జన్యానికి పాల్పడిన హయాత్ షరీఫ్‌పై కేసు నమోదు చేశారు. కర్ణాటక పోలీస్ యాక్ట్ సెక్షన్ 92 కింద కేసు పెట్టినట్లు బెంగళూరు వెస్ట్ డివిజన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ లక్ష్మణ్ బీ నింబర్గి తెలిపారు. నిందితుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.

YES9 TV