విశాఖలో హోం మంత్రి అమిత్ షా , టీడీపీతో పొత్తు – దిశా నిర్దేశం..!!

ఏపీలో పొత్తు రాజకీయం పై స్పష్టత వస్తోంది. వైసీపీ ఓటమి లక్ష్యంగా టీడీపీ, జనసేన కలవటం లాంఛనంగా మారింది. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి వస్తుందా లేదా అనే ఉత్కంఠ ఇప్పటి వరకు కొనసాగుతోంది.

ఈ సమయంలో బీజేపీ ముఖ్య నేతలు వరుసగా ఏపీలో పర్యటిస్తున్నారు.

బీజేపీ చీఫ్ నడ్డా వైసీపీ ప్రభుత్వ పాలన పైన ఆరోపణలు చేసారు. ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖలో జరిగే సభలో పాల్గొంటున్నారు. పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పాత్తులతో సహా ఎన్నికల కార్యాచరణ పై స్పష్టత ఇవ్వనున్నారు.

 

విశాఖ సభలో అమిత్ షా: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోజు విశాఖలో జరిగే బీజేపీ మహాజన సంపర్క్‌ అభియాన్ సభలో పాల్గొననున్నారు. కేంద్రంలోని ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయింది. కేంద్రం సాధించిన విజయాలతో పాటుగా పథకాల గురించి ఈ సభలో వివరించనున్నారు. ఏపీ ప్రభుత్వ పాలన పైన అమిత్ షా స్పందించే అవకాశం ఉంది.

అమిత్ షా సభ కోసం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్‌ షా ప్రసంగంపైనా అంచనాలు పెరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ సత్తా చాటుతామని బీజేపీ నేతలు చెబుుతున్నారు. ఈ సభకు మిత్రపక్షంగా ఉన్న జనసేనను ఆహ్వానించ లేదు. పార్టీ సభ కావటంతో ఆహ్వానం పంపలేదని బీజేపీ నేతలు స్పష్టం చేసారు.

టీడీపీతో పొత్తు పై తేల్చేస్తారా: సభ తరువాత పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. ఈ సమావేశం కోసం దాదాపుగా గంట సమయం కేటాయించారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ చీఫ్ నడ్డాతో సమావేశమయ్యారు. పొత్తు దిశగానే చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ భేటీలో చర్చలు..నిర్ణయాల పైన రెండు పార్టీల నుంచి ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు.

ఇప్పుడు ఏపీలో టీడీపీతో పొత్తు.. సఖ్యత గురించి పార్టీ నేతలకు అమిత్ షా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. జేపీ నడ్డా తాజాగా శ్రీకాళహస్తి సభలో చేసిన ప్రసంగం ద్వారా వైసీపీతో తమకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవనే సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు. ఇప్పుడు అమిత్ షా పార్టీ నేతలకు టీడీపీతో వ్యవహరించాల్సిన తీరు..ఎన్నికల రోడ్ మ్యాప్ పైన స్పష్టత ఇస్తారని చెబుతున్నారు.

 

పార్టీ నేతలకు దిశా నిర్దేశం: టీడీపీ, జనసేనతో పొత్తుకు బీజేపీ అంగీకరిస్తే 2014 తరహాలో ఎన్నికల్లో పొటీ జరగనుంది. బీజేపీ ఇప్పుడు జనసేనతో మాత్రమే పొత్తు..టీడీపీతో కలిసే అవకాశం లేదని చెబితే పవన్ కల్యాణ్ నిర్ణయం కీలకం కానుంది. బీజేపీతో ఉంటారా..కాదని టీడీపీతో జత కలుస్తారా అనేది తేలాల్సి ఉంది. తెలంగాణలో బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తు ఉండదని పదే పదే చెబుతున్నారు. రాష్ట్ర పార్టీని కాదని ప్రాంతీయ పార్టీలతో బీజేపీ నాయకత్వం పొత్తులు ఖరారు చేయదనేది ఆ పార్టీ నేతల విశ్లేషణ.

ఈ సమయంలో పొత్తు విషయంలో అమిత్ షా నిర్ణయం కీలకంగా మారనుంది. పార్టీ నేతలను ఎన్నికలకు సిద్దం చేస్తున్న క్రమంలో పొత్తులపైన అస్పష్టత కొనసాగుతున్న సమయంలో ఈ రోజు పార్టీ నేతల సమావేశంలో అమిత్ షా తమ వైఖరి తేల్చి చెబుతారని భావిస్తున్నారు. దీంతో, బీజేపీ నిర్ణయం పైన ఆసక్తి కొనసాగుతోంది.

YES9 TV