ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల నుంచి లభిస్తున్న ప్రత్యక్ష,పరోక్ష మద్దతుతో ఏ రాష్ట్రంలోనూ లేనంత బలంగా కనిపిస్తున్న బీజేపీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఇందులో తనకు పనికొచ్చే సమీకరణాన్ని మాత్రమే తెరపైకి తెస్తోంది.
దీంతో నాలుగేళ్లుగా బేషరతుగా బీజేపీకి మద్దతిస్తున్న పార్టీలకు షాక్ తప్పడం లేదు. తాజాగా బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డా రాష్ట్రంలో వరుస పర్యటనల వెనుక కూడా కీలక సమీకరణం ఉందన్న వాదన వినిపిస్తోంది.
ఏపీలో గతంలో రెండుసార్లు టీడీపీతో పొత్తు పెట్టుకుని దెబ్బతిన్న బీజేపీ ముచ్చటగా మూడోసారి పొత్తు కోసం వెంపర్లాడుతోంది. ఓవైపు బలంగా ఉన్న అధికార పార్టీ వైసీపీని కేంద్రంలో అవసరాలకు వాడుకుంటున్నా.. రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం కలుపుకోలేని పరిస్ధితి. దీంతో వైసీపీని కాదని టీడీపీవైపు బీజేపీ మొగ్గుచూపాల్సిన పరిస్ధితి నెలకొంటోంది. అదే ఇప్పుడు చంద్రబాబును ఢిల్లీ వరకూ తీసుకెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యేలా చేసింది. అదే ఇప్పుడు అమిత్ షాను ఏపీకీ రప్పిస్తోంది.
వైసీపీతో బీజేపీ నాలుగేళ్లుగా సత్సంబంధాలు నెరుపుతున్నా ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం ఆ పార్టీని కలుపుకోలేని పరిస్ధితి. ఇంకా చెప్పాలంటే బీజేపీతో కలిస్తే తన ఎస్సీ, మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బతింటుందో అన్న భయం జగన్ ను బీజేపీకి దూరంగా ఉంచుతోంది. దీంతో ఎన్నికల్లో ఎలాగో వైసీపీతో కలిసి పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే కాస్తయినా సానుకూల ఫలితాలు వస్తాయని బీజేపీ అంచనా వేసుకుంటోంది.
రాష్ట్రంలో ఓవైపు వైసీపీ, టీడీపీ, జనసేన మద్దతు తీసుకుంటూ మరోవైపు టీడీపీ-వైసీపీలపై పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్న బీజేపీ నేతలకు ఎన్నికల సమరం ముసుగు తీయక తప్పని పరిస్దితి తెచ్చిపెడుతోంది. అయితే ఇందులో వైసీపీతో కలిసి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ అడుగులేస్తోంది. అదే సమయంలో తమవై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు బీజేపీ అగ్రనేతలు ఏపీలో వరుసగా పర్యటనలు చేస్తున్నారు. కానీ వైసీపీపై పూర్తిస్దాయిలో యుద్ధం చేయకుండా టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగినా బీజేపీకి సానుకూల ఫలితాలు రావడం కష్టమేనని తెలుస్తోంది.
