తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల ఆశలు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఘర్ వాపసీ మొదలు పెడుతుంది. బీఆర్ఎస్, బిజెపిలో ఉన్న అసంతృప్త నేతలను, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూపించి, పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలను వెనుకకు ఆహ్వానిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు బీజేపీలో ఇబ్బంది పడుతున్న నేత ఈటల రాజేందర్ ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు.

రేవంత్ రెడ్డి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోయిన నేతలను, ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలను కాంగ్రెస్ పార్టీ బాట పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు లను కూడా హస్తం పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాహుల గాంధీ వారితో మాట్లాడగా, త్వరలో వారు కాంగ్రెస్ తీర్ధం తీసుకుంటారు అన్నది చర్చనీయాంశంగా మారింది.

తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరడం లేదని సాక్షాత్తు బిజెపి నేత ఈటల రాజేందర్ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వచ్చినట్లయింది. కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చినట్టు అయ్యింది.ఈ ఇద్దరు నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు రాగలిగితే, ఆపై చేరికలు జోరుగా కొనసాగుతాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

YES9 TV