కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలపై వ్యాఖ్యలు చేసిన ఆయన జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు చేసింది శూన్యం అంటూ ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు సామాజిక వర్గాలు 75 ఏళ్లుగా దోచుకుంటున్నాయని చింతామోహన్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీలో రెండున్నర సంవత్సరాలు కాపులకు అధికారం ఇస్తామని, రెండున్నర సంవత్సరాలు ఓబీసీలకు అధికారం ఇస్తామని చింతామోహన్ పేర్కొన్నారు.గతంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చిరంజీవి ముఖ్యమంత్రి అయి ఉంటే బాగుండేది అని చింతా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పట్లో సమీకరణాలు రాజకీయాలు తెలియకనే చిరంజీవి ముఖ్యమంత్రి కాలేకపోయారు అని చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తనకు చిరంజీవి మంచి మిత్రుడు అని తెలిపిన చింతా మోహన్ ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న రాజకీయాలపై పెదవి విరిచారు. 2024 లో ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చింతామోహన్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. 120 స్థానాలకు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు, ఓ బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రతి ఒక్కరు సంతృప్తిగా ఉన్నారని ఈ వర్గాల వారికి స్కాలర్షిప్పులు అందడంలేదని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేది లేదని ఆయన పేర్కొన్నారు. నిత్యం సిబిఐ కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రచ్చ కొనసాగుతుందన్న ఆయన జగన్ మళ్లీ అధికారంలోకి రారు రాలేరు ఆయన పని అయిపోయింది అంటూ వ్యాఖ్యానించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిరంజీవిలా అయోమయంలో పడిపోయారు అని చింతామోహన్ పేర్కొన్నారు. దేశంలో బీజేపీ పాలనలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, పేదలు పేదలుగానే ఉంటున్నారన్నారు. పార్లమెంట్ భవనాన్ని మార్చాల్సిన అవసరం లేకపోయినా మారుస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి చేయాల్సిన ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నారని చింతామోహన్ విమర్శలు గుప్పించారు.
