జనసేన నెమ్మదిగా తన కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా వీటిని పూర్తిచేసి ఎన్నికలు జరిగే చివరి 6 నెలలు పూర్తిగా రాజకీయాలకే పరిమితమవ్వాలనే యోచనతో ఉన్నారు.
దీంతో జిల్లాల్లో పర్యటనను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేస్తున్నారు. తాజాగా ఈయనకు జతగా నాగబాబు రంగంలోకి దిగారు.
ఆన్ లైన్ లో సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తోన్న నాగబాబు ఆఫ్ లైన్ లో యాక్టివ్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఎలమంచిలి నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎలమంచిలిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యాలయాలు ప్రారంభం కాబోతున్నాయి. నాగబాబు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కూడా జనసేనలో ఏదో జరగుతోందన్న అభిప్రాయాన్ని కల్పిస్తోంది. ఆయన తీరు కూడా వేరుగా ఉంటోంది.
