తెలుగు స్టేట్స్కి హైఅలర్ట్, అప్రమత్తంగా లేకపోతే మళ్లీ కొంపకొల్లేరైపోవడం ఖాయం. అవును, మీరు వింటున్నది నిజమే. ఏపీ, తెలంగాణకు మరోసారి డేంజర్ వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో నాలుగు రోజులపాటు వర్షాలు దంచికొట్టడం ఖాయమని హెచ్చరించింది. తెలంగాణకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మళ్లీ రాళ్లవాన దంచికొట్టడం ఖాయమంటూ హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం..
మండుటెండల్లో అకాల వర్షాలు వణికిస్తున్నాయ్. రీసెంట్గా కురిసిన రాళ్ల వానకు రెండు రాష్ట్రాల్లోనూ పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయ్. ఇప్పుడు మరోసారి వడగళ్లు విధ్వంసం సృష్టించడం ఖాయమంటూ డేంజర్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. నాలుగురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. ఉన్నట్టుండి క్యుములోనింబస్ మేఘాలు విరుచుకుపడే అవకాశముందని హెచ్చరించింది. పెనుగాలులు, వడగళ్ల వానతోపాటు పిడుగులు పడేఛాన్స్ ఉందంటోంది వెదర్ డిపార్ట్మెంట్.
మరోసారి రాళ్ల వాన అలర్ట్..
ఇక, తెలంగాణలో వడగళ్ల విధ్వంసం కొనసాగుతోంది. ఉన్నట్టుండి కురిసిన రాళ్ల వానకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయ్. ములుగు జిల్లాలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. గాలివాన దెబ్బకు వెంకటాపురం మండలంలో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయ్. ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
