తాను డబ్బులు కోసం ఆశపడే వ్యక్తిని కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైపు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే.. తాను ఓడిపోవడానికి కారణాలను కూడా చెప్పారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చెయొద్దని వారించారు. ఓటములు ఎదుర్కొన్నా.. ఓరిమితో బరిలో ఉన్నామని అన్నారు. రెండు చోట్ల పరాజయం పాలైనప్పటికీ.. వేలాది మంది కార్యకర్తలు, వందలాది మంది నాయకులు తన వెంట ఉన్నారని చెప్పారు. అన్ని విధాలా ధైర్యం చేసే జనసేన పార్టీ పెట్టానని చెప్పారు. పదేళ్ల ప్రస్థానంలో ఎన్నో మాటలు పడ్డామని.. మన్ననలు పొందామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీగా ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తోందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కులాలను కలిపేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. జనసేన ఉన్నదే సమాజంలో పరివర్తన తీసుకురావడానికని స్పష్టం చేశారు. ఒక కులాన్ని గద్దెని ఎక్కించడం కోసం తాను పూర్తిగా వ్యతిరేకమని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలన్న జనసేనాని.. అన్ని కులాలు పాలనలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.
తన దుష్ప్రచారం చేస్తే చెప్పతో కొడతానని పవన్ హెచ్చరించారు. ఒక కులం, ఒక మతం ఆధారంగా సమాజాన్ని నడపలేమని జనసేనాని అన్నారు. తన సినిమాలన్నీ ఒక్క కులం వారు చూస్తే తాను రోజుకు రూ. 2 కోట్ల పారితోషకం తీసుకోగలనా అని ప్రశ్నించారు. తన అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారని.. ఇప్పటికైనా కులం పేరుతో కొట్టుకు చావడం ఆగాలని పవన్ చెప్పారు.
