ఆకాశంలో చైనా గూఢచారి బెలూన్లు కలకలం రేపుతున్నాయి. భారత్, జపాన్తో సహా పలు దేశాలను లక్ష్యంగా చేసుకుని సీక్రెట్ ఆపరేషన్ చేపట్టినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల అమెరికా ఇన్స్టాలేషన్లపై తిరుగుతున్న చైనా నిఘా బెలూన్ను యూఎస్ మిలిటరీ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ చైనీస్ బెలూన్ కీలక సమాచారాన్ని అమెరికా అధికారులు భారత్తో సహా తమ మిత్రదేశాలకు వెల్లడించారు. ఈ బెలూన్ను శనివారం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా దక్షిణ కరోలినా తీరంలో ఫైటర్ జెట్ ధ్వంసం చేసింది. అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండి షెర్మాన్ రాయబార కార్యాలయాల అధికారులకు చైనా బెలూన్ను ధ్వంసం చేయడంపై సమాచారాన్ని అందించారు. “జపాన్, ఇండియా, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్తో సహా అనేక దేశాలలో సైనిక ఆస్తులతోపాటు.. చైనాకు వ్యూహాత్మక ఆసక్తి ఉన్న ప్రాంతాలలో సమాచారాన్ని సేకరించింది” అని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. రక్షణ, ఇంటెలిజెన్స్ అధికారులతో ఇంటర్వ్యూల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.
చైనా పీఎల్ఏ వైమానిక దళం పంపించిన ఈ బెలూన్లు 5 ఖండాలలో కనిపించాయని అధికారులు తెలిపారు. ఈ బెలూన్లు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని బెలూన్లలో భాగమని.. వీటిని నిఘా కార్యకలాపాలు నిర్వహించేందుకు అభివృద్ధి చేసి ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించారని ఓ సీనియర్ రక్షణ అధికారి వెల్లడించారు. గతంలో హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువామ్లలో 4 బెలూన్లు కనిపించాయి. తాజాగా గత వారం ఒక పెద్ద బెలూన్ కనిపించడం కలకలం రేపింది. నాలుగు బెలూన్లలో మూడు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన సమయంలోనే వెలుగులోకి వచ్చాయి. అయితే అవి చైనా గూఢచారి బెలూన్లుగా ఇటీవల గుర్తించారు. పెంటగాన్ రిపోర్ట్ మంగళవారం బెలూన్ చిత్రాలను విడుదల చేసింది. మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. వాషింగ్టన్లోని వార్ రూమ్లో అధికారులు యూఎస్ ఈస్ట్ కోస్ట్ నుంచి చైనీస్ గూఢచారి బెలూన్ను కూల్చివేసిన సంఘటనలపై నిరంతరం సమాచారం తెలుసుకుంటున్నారని చెప్పారు. యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్, చైనా కౌంటర్ జనరల్ వీ ఫెంఘే మధ్య టెలిఫోనిక్ సంభాషణ కోసం చేసిన అభ్యర్థనను చైనా తిరస్కరించిందని యూఎస్ డిఫెన్స్ మినిస్ట్రీ ప్రధాన కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. ఈ పూర్తి నివేదిక ఇప్పుడు యూఎస్ కాంగ్రెస్లో ప్రవేశపెట్టనున్నారు.
