ప్రస్తుతం పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుందని నేషనల్ హెల్త్ కమీషన్…

పొరుగుదేశం చైనాలో ఇటీవల కోవిడ్ మహమ్మారి ఎలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. దేశంలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి, మరణాలపై అధికారికంగా ఇప్పటి వరకూ ప్రకటించని చైనా..ఎట్టకేలకు ఆ విషయాన్ని అంగీకరించింది. చైనాలో డిసెంబర్ 8 నుంచి జనవరి 12 వరకూ అంటే కేవలం నెలరోజుల వ్యవధిలో దాదాపు 60 వేలమంది కోవిడ్ కారణంగా మరణించినట్టు ఆ దేశపు నేషనల్ హెల్త్ కమీషన్ వెల్లడించింది. డిసెంబర్ నెలలో ఆ దేశంలో కోవిడ్ జీరో పాలసీ ఎత్తివేసినప్పటి నుంచి ఈ పరిస్థితి నెలకొంది. కోవిడ్ కారణంగా చైనాలో ఆసుపత్రిపాలవుతున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఆసుపత్రులు ఖాళీల్లేక ఎక్కడ పడితే అక్కడే చికిత్స చేయించుకుంటున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. 60 వేల మరణాల్లో 5,503 మందికి కోవిడ్ కారణంగా శ్వాస ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరణించినవారిలో 90 శాతం మంది 65 సంవత్సరాలు పైబడినవారుగా తేలింది.

ప్రస్తుతం పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుందని నేషనల్ హెల్త్ కమీషన్ తెలిపింది. విషమంగా ఉన్న కేసుల సంఖ్య పీక్స్‌కు చేరిందన్నారు. దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో జ్వరం కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. దేశంలో డిసెంబర్ నుంచి 1.4 బిలియన్ల మంది కోవిడ్ బారిన పడినట్టు కమీషన్ తెలిపింది. మూడేళ్లపాటు కఠినంగా అమలు చేసిన కోవిడ్ మార్గదర్శకాలను ఎత్తివేసినప్పటి నుంచి దేశంలో ఈ పరిస్థితి నెలకొంది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో కేవలం 5 వేలమందే కోవిడ్ కారణంగా మరణించినట్టు గతంలో చైనా తెలిపింది. అయితే డిసెంబర్ నుంచి జనవరి మధ్యకాలంలో కేవలం నెలరోజుల్లోనే 60 వేలమంది మృత్యవాత పడటం గమనార్హం. చైనాలో గత 2-3 నెలల్నించి కోవిడ్ మహమ్మారి పీక్స్‌కు చేరింది. ముఖ్యంగా చైనా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. జనవరి 21 నుంచి లూనార్ కొత్త సంవత్సరం సెలవుల సందర్భంగా పట్టణాలు, నగరాల్నించి పెద్ద సంఖ్యలో ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు తరలి వెళ్లనుండటంతో ఈ పరిస్థితి మరింత జటిలం కానుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

Editor