Latest Posts

బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి.

బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసిందన్నారు. ప్రభుత్వం వైఖరితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఇంకొందరు పుస్తెలు అమ్ముకున్నారని అన్నారు. సర్పంచుల నిరసనకు సంఘీభావంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుందని.. అయినా హైకోర్టు అనుమతితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తోందని చెప్పారు. ఈ ధర్నాకు ఎంతో మంది సర్పంచులు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారని.. గ్రామం గౌరవం పెరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు గౌరవం ఇవ్వాలన్నారు. ‘సర్పంచులకు రావాల్సిన నిధులను విడుదల చేయాలి. వివిధ మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సర్పంచుల వాటాను వారి ఖాతాలో వేయాలి. వారికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం దోపీడీ చేస్తోంది. నిధులు రాకపోవడంతో సిరిసిల్ల నియోజకవర్గంలో ఆనంద్ రెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకుండు.

ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో 60మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. సర్పంచుల ఆత్మ గౌరవం దెబ్బతీసి వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పింది కేసీఆర్ కాదా..? కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికే ఆ నిధులను దారి మళ్లించారు. సర్పంచులకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. చెట్టు చనిపోతే సర్పంచ్‌ను సస్పెండ్ చేస్తారట. మరి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను ఏం చేయాలి. కేటీఆర్ నిర్లక్ష్యం వల్ల మూసీలో మునిగి 30 మంది చనిపోయారు. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా మామూలు పరిస్థితులు లేవు. మునిసిపల్ శాఖ మంత్రి నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. రాష్ట్రాన్ని ఇంత అధ్వాన్నంగా మార్చిన తండ్రీ, కొడుకులను ట్యాంక్ బండ్ మీద ఉరేసినా తప్పు లేదు..’ అని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుట్టబోయే బిడ్డమీద కూడా లక్షా 50 వేల అప్పు వేశారని.. తెలంగాణ మోడల్ అంటే ఇదేనా..? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటే భారత్ రాష్ట్ర సమితి కాదు భస్మాసుర సమితి అని కొత్త అర్థం చెప్పారు. బుద్ది మార్చుకోకపోతే ఈ భస్మాసుర సమితి కూడా కేసీఆర్‌ను కాపాడలేదన్నారు. సర్పంచుల సమస్యలు తీరాలంటే కేసీఆర్ పోవాలి.. బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని పొలిమేరలు దాటేదాక తరమాలని అన్నారు.

Editor