జనసేన నేత, సినీ నటుడు నాగబాబు ఏపీ ప్రభుత్వంపై మరోసారి తన అక్కసు ప్రదర్శించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1ను విమర్శిస్తూ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు. ఆ వివరాలు మీ కోసం.. కందుకూరు, గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన రోడ్షో, సభల్లో తొక్కిసలాట జరిగిన 11 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. సామాన్యుల ప్రాణాలు పోతుండటంతో ప్రభుత్వం సీరియస్ అయింది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీ రాజ్ రహదారులపై సభలు, సమావేశాల్ని ప్రభుత్వం రద్దు చేసింది. సభలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. ఇప్పుడీ జీవోపై జనసేన నేత నాగబాబు మండిపడుతున్నారు. ఈ జీవో ప్రభుత్వ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని నాగబాబు తెలిపారు. రోడ్షో, సభలు నిర్వహించడం రాజకీయ పార్టీల హక్కు అని, ఈ జీవోపై న్యాయస్థానానికి వెళతామన్నారు.
సభలు నిర్వహించేటప్పుడు రాజకీయపార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటాయన్నారు. చంద్రబాబు సభలో తొక్కిసలాట జరగడం దురదృష్టకరమన్నారు. వీటిని కారణంగా చూపిస్తూ..ర్యాలీలు, రోడ్షోలు నిషేధించడం సరికాదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఆపడం ఎవరి తరమూ కాదన్నారు. ర్యాలీలు, రోడ్షోల నిషేధంతో మీ భయం స్పష్టంగా కన్పిస్తోందని నాగబాబు విమర్శించారు. దేశంలో అన్ని మతాలు, కులాలు పండుగలకు ర్యాలీలు నిర్వహిస్తుంటారు. అవన్నీ నిబంధనల ప్రకారం జరుగుతాయి. అటువంటప్పుడు ప్రతిపక్షాల ర్యాలీలు నిర్వహించకుండా నిబంధనలు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా లేక రాచరిక పాలన నడుస్తోందా అని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చి ఉంటే..జగన్ పాదయాత్ర చేసుండేవారా అని నిలదీశారు. పవన్, చంద్రబాబు వంటి నేతలు ఎంత ఆపితే అంత బౌన్స్ అవుతారని నాగబాబు తెలిపారు. జీవో నెంబర్ 1పై రాజకీయ పార్టీల పరంగా నిరసన చేపడతామన్నారు. ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
