కర్ణాటకలోని విజయపుర జిల్లా కేంద్రంలోని విజయపుర జ్ఞానయోగాశ్రమం పిఠాధిపతి సిద్ధేశ్వర స్వామి ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సిద్ధేశ్వర స్వామి సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 81 ఏళ్లు. సిద్ధేశ్వర స్వామి మృతి నేపథ్యంలో విజయపురలోని స్కూళ్లు, కాలేజీలకు కర్ణాటక సర్కారు మంగళవారం నాడు అధికారిక సెలవు ప్రకటించింది. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య సిద్ధేశ్వర స్వామి అంత్యక్రియలు జరిపించనున్నట్టు కర్ణాటక సర్కారు స్పష్టంచేసింది. సిద్ధేశ్వర స్వామి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ట్విటర్ ద్వారా సిద్ధేశ్వర స్వామీజికి ఘన నివాళి అర్పించిన ప్రధాని మోదీ.. పరమ పూజ్య సిద్ధేశ్వర స్వామి ఈ సమాజానికి చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తుచేసుకున్నారు. ఇతరుల అభ్యున్నతి కోసం అవిశ్రాంత పోరాటం చేశారని సిద్ధేశ్వర స్వామి సేవలను కొనియాడారు. సిద్ధేశ్వర స్వామి సేవలను గుర్తించిన భారత సర్కారు 2018 లో ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. అయితే, తనకు అవార్డు ప్రకటించిన ప్రధాని మోదీకి, భారత ప్రభుత్వానికి లేఖ రాసిన సిద్ధేశ్వర స్వామి.. తనకు ప్రభుత్వంపై గౌరవం ఉంది కానీ అవార్డు మాత్రం వద్దు అంటూ సున్నితంగానే తిరస్కరించిన నిరాడంబరుడు ఆయన. సిద్ధేశ్వర స్వామికి కర్ణాటక ఆద్యాత్మిక వేత్తల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో సిద్ధేశ్వర స్వామిని నడిచే దైవంగా పిలుచుకుంటుంటారు.
